home
Shri Datta Swami

 11 Feb 2002

శఙ్కరాయతే

 

శంకరాయ తే లోక శంకరాయ తే
వందనాని మే దేవ వాసుదేవస్య ॥ (పల్లవి)

వాసుదేవుడనే పేరుగల కృష్ణుడైన నేను, శంకరుడివి, సమస్త లోకాలకు శుభములను కలిగించే శంకరుడివైన నీపాదపద్మములయందు నమస్కారములను సమర్పిస్తున్నాను.

ఫాలలోచనం తవ హి మే సుదర్శనమ్ ।
శూలమేవ తే తిలకమూర్ధ్వపుండ్రకమ్ ।
నీలకంఠ తే భాతి కంఠనీలిమ ।
విస్తరాన్మహో మమ హి దేహ నీలిమ ॥1॥

నీ నుదుటిపైనున్న అగ్నినేత్రమే (మూడవకన్ను) నిజానికి నా చూపుడువేలిపై తిరుగుతున్న సుదర్శన చక్రము. నీవు చేతిలో ధరించిన త్రిశూలమే నిజానికి నా నుదుటిపై నిలువుగా తిలకంగా ధరించిన ఊర్ధ్వపుండ్రము (తిరునామము). ఓ నీలకంఠుడా! నీ అందమైన కంఠముపైనున్న చిక్కని నీలిరంగు నా శరీరమంతటా వ్యాపించి ఒక ప్రత్యేకమైన నీలిరంగుతో చక్కగా ప్రకాశిస్తున్నది.

ఫాలచక్షుషా దగ్ధ పద్మసాయకమ్ ।
సాదరాక్షిణా దృష్ట పద్మ సంభవమ్ ।
ప్రేమ వీక్షణాలోల పద్మలోచనమ్ ।
త్వాం త్రిలోచనం దేవ సంస్మరామ్యహమ్ ॥2 ॥

నీకున్న మూడు కన్నులలో, నుదుటిపైనున్న అగ్నినేత్రాన్ని తెరిచి, పద్మములనే బాణములుగా కలిగి నీ తపస్సును భంగము చేయుటకు వచ్చిన మన్మధుడిని బూడిద చేసావు. నీ కుడికంటితో పద్మాసీనుడై, అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానమును కలిగిన బ్రహ్మదత్తుడిని  ఆదరముతో చూసావు. నీ ఎడమకంటితో పద్మముల వంటి కన్నులు గల జగన్మోహినిగా అద్భుత సౌందర్యవతియైన రూపాన్ని దాల్చిన, భార్యయైన విష్ణుదత్తుడిని చూసావు. (క్షీరసాగర మథన సందర్భంలో విష్ణుమూర్తి అనర్హులైన రాక్షసులకు అమృతం దగ్గకుండా చేయుటకు వారిని జగన్మోహన రూపంతో మోహింపచేసి  కార్యం సాధిస్తాడు. అదే సమయంలో హాలాహలాన్ని సేవించి తన కంఠంలో ఇముడ్చుకుని ఇవేవీ గమనించలేని శివుడు కైలాసానికి వెళ్ళిపోతాడు. తరువాత వైకుంఠానికి వెళ్ళిన శివుడు జగన్మోహన్యాకారాన్ని చూపించమని అడుగగా ఆ రూపాన్ని మరల ధరించిన విష్ణువుని చూసి శివుడు మోహితుడవుతాడు. ఆ విధంగా హరిహరులైన వారిద్దరికీ జన్మించిన పుత్రుడే మణికంఠుడు.) అందువలన ఒక్కొక్క కంటితో ఒక్కొక్క ప్రత్యేకమైన కార్యమును సాధించిన త్రినేత్రుడిగా నిన్ను ఎల్లపుడూ స్మరించుకుంటాను.

నటన పండిత స్ఫురతి రమ్య తాండవమ్ ।
చిత్రమండలం భ్రమణలోలకుండలమ్ ।
ఉరగమండన స్ఖలిత ధర్మ దండనమ్ ।
దనుజ ఖండనం విజిత భారతీ భండనమ్ ॥3॥

నృత్యములో అందరికీ పరమ గురువైనవాడా! నీవు చేసే అద్భుతమైన తాండవమనే నృత్యము ప్రపంచ ప్రసిద్ధమై, అన్ని రకములు నృత్యములకు మూలమైనది. నీవు నృత్యం చేస్తూ భూమిపై వృత్తాలు గీస్తుండగా నీవు చెవులకు ధరించిన కుండలములు ప్రతి వృత్తంతో పాటు అందంగా కదలుచున్నవి. సర్పములనే ఆభరణములుగా ధరించిన ఓ ప్రభూ! తన విధి నిర్వహణలో చేసిన అపరాధం కారణంగా ధర్మదేవతయైన యమధర్మరాజుని కూడ చివరకు నీవు శిక్షించక విడిచిపెట్టలేదు. (సావిత్రి చనిపోయిన తన భర్త సత్యవంతుని ప్రాణములనిమ్మని పదే పదే యముని ప్రార్థించగా యముడు సత్యవంతుని ప్రాణములనిచ్చి బ్రతికించెను. కాని సమస్త జగత్తులకే కాక తనకు కూడ స్వామియైన పరమేశ్వరుని మార్కండేయుడనే చిన్న పిల్లవాడు ప్రార్థించినా కూడ విధి నిర్వహణ పేరుతో అతని ప్రాణములను తీయ ప్రయత్నించెను. కర్తవ్య నిర్వహణలో యమ ధర్మరాజు చేసిన ఈ మహాపరాధమును పరమేశ్వరుడు గుర్తు చేసి ధర్మమును నిలుపుటకు యముని సంహరించెను. అయినా, సమస్త దేవతలు ప్రార్థింపగా పరమ కరుణతో మరల యముని బ్రతికించెను.)

 
 whatsnewContactSearch