త్రిపథగామిని శిరసుగంగయు -
మూడు నేత్రములశ్రుధారలు।
చిందించుచుండ చిందులేసెను -
హృదయతాపము నోర్వగలేక॥
శాంతి దేవరా ! శాంతి దేవరా ! -
అనుచునందియు ప్రమథులు చెప్ప।
ఆలకించడు ఆదిదేవుడు -
అలమటించుచు అరచి ఏడ్చెను॥
అంగములన్ని అదురుచుండగ -
కైలాసమున కాలకంఠుడు।
ఏది నా సతి నాసతియనుచు -
అందరినడిగి ఎగిరి ఏడ్చెను॥
రాక్షసులైన అడిగిన వెంట -
నిచ్చెవరముల కరుణార్ణవుడు।
సతినిమ్మనుచు యాచించునదె -
కింకరులనట నాట్యమాడుచు॥
నా నింద విని ప్రాణము విడచె -
కలరే ఇట్టి భక్తులు జగతి?।
నా ప్రాణములు పోవవేలనో -
అని విలపించె తాండవమందున॥
తూలును ఎగురు మెలికలు దిరుగు -
గంతులు వేయు చేతులు ద్రిప్పు।
హాహాయనును హాలాహలమె -
మింగినవాడె విలవిలలాడె॥
వర్తమానము భావిభూతము -
కాలమునందు నిట్టి ప్రేయసి।
ఉండబోదని ఘోషించెనట -
వేదనాగ్నికి వేగిపోయెను॥
ప్రళయమందున సర్వదహనుడు -
ఫాలనేత్రుడే వలవలయేడ్చె।
సతీ విరహము తాపమునందు -
తాళజాలక తాండవించెను॥
నా నిందకే దహనమైతివి -
నేనింకనూ బ్రతికి యుంటిని।
నన్ను మించిన కఠినుడుండునె -
అనుచు శంకరు డరచియాడెను॥
పింగళ జటల విదిలించునదె -
విపరీతముగ గంగ చిందగ।
సతీ దహనము నూహించగ -
వక్కలై తలపడుట తోచెను॥
నాసతియనుచు కౌగిలించును -
శూన్యమందున సతి భావమున।
కంపముతోడ నృత్యము జేసె -
మంటలబడిన నాగుపాముగ॥
భక్తుల పైన భగవత్ప్రేమ -
అపారమగును అందున సతియు।
భక్తరత్నము స్వామి హృదయము -
తల్లడిల్లెను కల్లోలమై॥
ఉమగా సతియె అవతరించియు -
మరల చేరినగాని ముఖమున।
మందహాసము పుట్టలేదుగ -
శివునికప్పుడె శాంతి వచ్చెను॥