ఉపమన్యువనెడి తాపసబాలుడు -
పాలు లేక విలపించె నాశ్రమమున।
దిక్కుతోచని తల్లి పలికెను -
సర్వేశ్వరునే అడుగు పొమ్మని॥
అంతట బాలుడు బయలుదేరెను -
దుర్గమారణ్య మార్గమందున।
నాన్నా! శంకర! పాలనీయవా! -
అన్న వాక్యమే మంత్రమాయెను॥
ప్రళయ భయంకరుడైనను నీవు -
కరిగిపోతివి కరుణార్ణవమా।
యుగ యుగ తపముల కందనివాడవు -
క్షణమున ఎదురుగ నిలిచినావు॥
ఫాలనేత్రము నుండియు కురిసెను -
వేడి వేడి కన్నీటి ధారలు।
పాలబుగ్గల పసివానిఁ జూసి -
నాన్నా రమ్మని కౌగలించితివి॥
తొడను కూర్చుండ పెట్టుకొంటివి -
చేతిలోనికే పరుగున వచ్చెను।
పాలసముద్రమె బాలున కీయగ -
నీ కరుణఁ జూచి అసురులె ఏడ్చిరి॥