25 May 2025
శ్రీదత్తునిగా దర్శనమిచ్చుట.
[సీతమ్మ]
విజయవాడ - కృష్ణలంకలోని సీతమ్మ గారికి ఒకసారి బంగారుఛాయతో త్రిముఖ షడ్భుజ దర్శనమిచ్చినారు స్వామి. ఆ దర్శనముతో ఆమె మూడు రోజులు తన్మయావస్థలో నుండినది.
స్వామి తిరుపతిలో ఖాదిబోర్డు మాజీ సెక్రటరీ శ్రీ గండ్రకోట శివరామమూర్తి గారింట్లో మూడు రోజులు శ్రీ దత్తభగవానుని భజన చేయటం తటస్థించినది. మూడవ రోజున ఒక అద్భుతం జరిగినది. మూడవ రోజున భక్తులందరూ నమస్కరించు సమయంలో శివరామమూర్తి గారి పెద్దకోడలు వల్లికి ఒక అద్భుత దర్శనం కలిగింది. స్వామి వారు ఆమెకు త్రిముఖ షడ్భుజరూపములో దర్శనమిచ్చారు. "నీ కిప్పుడు నేనెలా కనిపించానో అందరికి వినపడేలా చెప్పు" అన్నారు దత్తస్వామి. "మీరు త్రిముఖ షడ్భుజములతో దర్శనమిచ్చారు" అన్నది ఆమె. అప్పుడు స్వామి! మందహాసము చేయుచూ "నిజమేనా? బాగా చూసి చెప్పు" అన్నారు ఆమెతో. అప్పుడు ఆమె కన్నులు నలుపుకొని మరల చూచినది. "నిజమే అలానే కనిపిస్తున్నారు” అని చెప్పినది.
శ్రీగణపతి సచ్చిదానంద స్వామి వారి ప్రియతమ భక్తులు శ్రీ సుబ్రహ్మణ్యం గారు. వీరు ఒకసారి శ్రీస్వామీజీని కలసి, "స్వామీజీ! నేను ఉద్యోగం మానేస్తాను, తమ సేవలో గాణుగాపురంలో ఉండిపోతా" నన్నారట. ఈ విషయమే విజయవాడలో స్వామిని కలసినప్పుడు చెప్పినారు. అప్పుడు స్వామి ఇలా వచించారు. "వద్దు మీరు గాణుగాపురం వెళ్ళవద్దు” అన్నారు. సుబ్రహ్మణ్యంగారు గాణుగాపురం వెళ్ళలేదు. ఈ సంఘటన జరిగిన నెల రోజులలోనే సుబ్రహ్మణ్యంగారు మైసూరు ఆస్పత్రిలో మరణించినారు. ఆయనకు చివరి ఘడియలలో స్వామి దర్శనమిచ్చినారు. ఆ దర్శనములో త్రిముఖ షడ్భుజరూపములో స్వామి దర్శనం అనుగ్రహించినారు. ఆ దర్శనములో దత్తముఖాల స్థానములో స్వామిముఖమే ఉన్నదట!
ఆ సమయములో సుబ్రహ్మణ్యంగారు భార్యతో ఇలా చెప్పినారట. “నీవు పోయి విజయవాడలో నున్న స్వామిని దర్శించుకో, తరిస్తావు” అని వచించారట. "ఆయన సాక్షాత్తు దత్తుడు. ఆయన నాకు త్రిముఖ షడ్భుజరూపములో సాక్షాత్కరించినారు. ఆయన పాదాల వద్ద ఒక ఋషి పుష్పాలను పైకి చల్లుతూ స్వామిని ఆరాధిస్తూ కనిపించినారు" అని చెప్పినారట. ఈ మాటలే సుబ్రహ్మణ్యం గారి చివరి మాటలట. ఈ మాటలు చెప్పగానే, మాట పడిపోయి సుబ్రహ్మణ్యంగారు పరమపదించినారు. వీరి భార్య విజయవాడ వచ్చి ఈ విషయం వివరించినారు. సుబ్రహ్మణ్యంగారి అపరక్రియలను శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ స్వయముగా నిర్వహించినారట. సుబ్రహ్మణ్యంగారు ఎంత యోగ్యులో కదా. అంతిమ దత్తదర్శనం పొందినాడు గదా!
★ ★ ★ ★ ★