30 May 2025
విష్ణుచక్రమును చూపుట
[రమ, పద్మ (రమ అక్క), పద్మారామ్ (రామచంద్రాపురం)]
స్వామి సత్యనారాయణపురంలో ఓగిరాల వారి వీథిలోయున్న శిష్ట్లా భీమశంకరం, వసుమతి గారి ఇల్లు పావనం చేశారు. ఆ సందర్భంలో ఒకరోజు స్వామి సాయంకాలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వాస్తవ్యురాలు శ్రీమతి పద్మరామ్ గారితో ఫోనులో సంభాషిస్తున్నారు. ఆమె గొప్ప భక్తురాలు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని చేతిలోని పద్మమేనట. ఆ భక్తురాలితో స్వామి ఫోనులో మాట్లాడుచూ, “నందనా” అనే పాట వినిపిస్తున్నారు. ఆ పాటలో “అష్ట సిద్ధులను భ్రమలను వీడుము – పాపలకే గద మాయలు వింతలు” అని పాడారు. వెంటనే పద్మరామ్ ఇలా అన్నారు.
"పోనీ స్వామి! అష్టసిద్ధులు నాకు చూపకపోతే సరే మీ ఇష్టం. కాని నాకు చూడాలని ఉంది. ఒక పని చేయండి. విజయవాడలో ఉన్నారు గదా. అక్కడ ఎవరికైనా ఈ క్షణంలోనే ఒక సిద్ధిని చూపించి, వారిచే నాకు ఫోను చేయించి, వారికి ఏమి అనుభవమైనది వెంటనే నాకు చెప్పించండి. అది చాలు నేను సంతోషిస్తాను" అన్నది ఆమె.
ఆ సమయంలో విజయవాడలో సత్యనారాయణపురంలో భీమశంకరం గారి ఇంట్లో ప్రక్క భాగంలో అద్దెకున్న పద్మా, ప్రభాకర్ల ఇంటికి ప్రభాకర్ గారి మరదలు రమ హైదరాబాదు నుండి ఆ రోజే రావటం జరిగింది. ఆ సమయంలో ఆ పిల్ల రమ వారి ఇంట్లో నుండి భీమశంకరం గారి ఇంట్లోకి వస్తోంది. ఫోనులో పాట పాడుతున్న స్వామిని చూచింది. అంతే! ఆశ్చర్యచకితురాలైంది. ఏమిటి ఈ విచిత్రం!! స్వామి తల వెనుక పంచ రంగులతో ఒక తేజశ్చక్రము తిరుగుతు కనిపించింది. అంతకు ముందు స్వామిని చూడటంగాని, స్వామిని గురించి వినటంగానీ లేని ఆ పిల్ల తెల్లపోయింది. ఆ దివ్యదర్శనంతో ఆ పిల్ల ఎంతటి ఉద్రేకానికి లోనైందంటే, ఆ రోజు సాయంత్రం జరిగిన భజనకు రాలేదు సరికదా ఆ భజన సమయంలో స్వామి వంక చూడటానికే భయపడి వణకసాగింది. ఏమిటి కారణం? అని ఆ పిల్ల అక్కగారు వత్తిడి చేయగా అప్పుడు భయపడుతూ, భయపడుతూ ఆ నిజాన్ని వివరించింది. అప్పుడు కాని అందరికి ఆ విషయం తెలియలేదు.
తర్వాత స్వామి ఆమె పూర్వజన్మను గురించి వివరిస్తూ, ఆమె శ్రీరంగంలో భగవత్సాన్నిధ్యంలో నృత్యం చేసిన నర్తకి అనియు, ఆ పుణ్యవిశేషం చేత ఈ జన్మలో ఆమెకు స్వామి ఈ దివ్యచక్రదర్శనం అనుగ్రహించారని వివరించారు. దివ్యదర్శనం జరిగిన విషయాన్ని, వెంటనే భీమశంకరం గారి కుమారుడు ఫణి రామచంద్రాపురం ఫోను చేసి పద్మరామ్ గారికి ఈ దివ్యప్రదర్శనమును గురించి తెల్పటంతో ఆమె పరమానంద భరితురాలైంది. రమ కూడా ఫోనులో పద్మరామ్ తో మాట్లాడటంతో పద్మరామ్ ఆనందానికి అవధులు లేవు.
"రమ చూచినది విష్ణుచక్రము. అదే కాలచక్రము. పంచరంగులే పంచభూతములతో చేసిన సృష్టి" అని వివరించారు స్వామి.
ఇది ఇలా ఉండగా మరియొక విచిత్ర సంఘటన జరగటం విశేషం.
రమ విజయవాడలో విష్ణుచక్రం దర్శించిన సమయంలోనే స్వామి గ్రామమైన నరసరావుపేటలో ఒక భక్తునికి శ్రీలక్ష్మియను అమ్మవారు పూని, స్వామి బంధువులతో ఇలా సెలవిచ్చినది.
“విజయవాడలో ఉన్న మీ స్వామి తలచుట్టూ ఎప్పుడూ పంచరంగుల విష్ణుచక్రం తిరుగుతూ ఉంటుంది. అది ఈనాడు ఒకరికి కనిపించింది” అని చెప్పుట మరో అద్భుతవిశేషము.
★ ★ ★ ★ ★