31 May 2025
ఫణికి ఆత్మలింగమును చూపుట
[ఫణి]
అది కార్తికమాసం. సోమవారం. భీమశంకరంగారి ఇంట్లో ఆ రోజు స్వామి ఉన్నారు. కార్తికమాసం మొదటి సోమవారం కదా. సాయంకాలం స్వామి భజన ఆరంభించినారు. ఆ రోజు స్వామి ఎన్నో కొత్త పాటలను ఆశువుగా చెప్పసాగినారు. రాత్రి 10:30 అయింది. భక్తులందరూ నిద్రలోకి జారుకున్నారు. భీమశంకరంగారి కుమారుడు ఫణిమాత్రం స్వామి పాదాలవద్ద ఆసీనుడైయున్నాడు. స్వామి నిద్రించకుండా ఫణి నిద్రించడు గదా. స్వామి పాదసేవ చేస్తూ, స్వామి నిద్రించిన తరువాతనే ఫణి నిద్రిస్తాడు ఎప్పుడూ. కానీ, ఆ రోజు మాత్రం ఎందుకో స్వామి ఫణిని పోయి నిద్రించమని చాలాసార్లు హెచ్చరించారు. ఫణి స్వామి మాట వినలేదు. స్వామి కసురుకున్నారు. “పోయి పడుకో” అని పెద్దగా అరిచారు. నిద్రలోకి జారుకున్న కొందరు భక్తులు త్రుళ్ళిపడి లేచి "ఇదేమిటి? ఈరోజు యిలా అరుస్తున్నారు స్వామి" అని ఆశ్చర్యపడి మరల నిద్రలో మునిగినారు. ఫణి మాత్రం భీష్మించుకొని కూర్చుండినాడు స్వామి పాదసేవ చేస్తూ. సరిగ్గా అర్థరాత్రి 12 గం॥ లింగోద్భవకాలమైనది. స్వామి హృదయమునుండి ఒక మహాతేజోమయమైన తరంగముగా జ్యోతిర్లింగం బయటకు వచ్చినది. దాని నుండి 'ఓంకార' నాదము నిరంతరము వెలువడుచున్నది. దాని తేజస్సులో ఆ గది గోడలు కూడా కనిపించుటలేదు. "స్వామీ! ఏమిటిది? శివలింగము!" అని అరచినాడు ఫణి. దానికి స్వామి "ఇది రోజూ వస్తుంది. ఎవరికీ కనపడదు." అన్నారు. ఫణి ఆత్మలింగమును పట్టుకొనవలయునని స్పృశించినాడు. ఫణి చేతివ్రేళ్ళు లింగములోనికి దూరినవి. బయటకు తీసినాడు. వ్రేళ్ళు చాలాసేపు మెరిసినవి. సుమారు 15 ని.లు ఆత్మలింగము నిలచి, మెల్లగా స్వామి హృదయములోకి పోయి అదృశ్యమైనది. ఈ దివ్య దర్శనమును పొందిన ఫణి 3 రోజులు ప్రాపంచిక అవస్థకు అతీతముగా ఉండిపోయాడు. ఆ మరునాడు స్వామి యిలా వివరించినారు. “సృష్టి చేయాలని మొదటగా కలిగిన సంకల్పశక్తి తరంగమే ఆత్మలింగము. ఆ తరంగమే కుండలిని, ఆదిశక్తియగు అనఘ”.
ఈ దివ్యదర్శనము ఫణి యొక్క పూర్వజన్మ పుణ్యఫలమేననియు, ఫణి సాక్షాత్తు ఆదిశేషుని అవతారమని వివరించిన స్వామి దివ్యవాక్కులను విని అందరూ ఆనందడోలికలలో తేలియాడినారు. ఆహా! ఎంతటి అద్భుత దర్శనము!
★ ★ ★ ★ ★