03 Jun 2025
స్వామి సాక్షాత్తు శ్రీరాముడే
[వేంకటేశ్వరరావు, సరిత]
మార్చి 12వ తేదీన శివరాత్రి. మేము శివరాత్రి ఉత్సవాలకు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి మైసూరు ఆశ్రమమునకు వెళ్ళాము. సభ ముగియగానే స్వామీజీ ఇలా ఆజ్ఞాపించారు. “శివరాత్రి దీక్ష పూర్తయింది. మీరందరూ వెంటనే ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోండి. 15వ తేదీ ఉదయంలోగా ఎవరి స్థానాలకు వారు చేరుకోండి” అని ఆజ్ఞాపించారు. ఏమిటి! స్వామీజీ ఇలా ఆజ్ఞ ఇచ్చారు! అనుకొన్నాము. పత్రికలు చూడగా 15 మార్చిన అయోధ్యలో రామమందిర శిలాన్యాస ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. స్వామీజీ ఆజ్ఞానుసారముగా మేము బయలుదేరి విజయవాడ చేరుకున్నాము. మార్చి 15వ తేదీ రానే వచ్చింది. ఈనాడే రామమందిర శిలాన్యాసము. గుజరాత్ అల్లర్లతో ఉడికిపోతున్నది. ఆ రోజు మధ్యాహ్నం స్వామి 2 గం॥కు కృష్ణలంకలో శ్రీవేంకటేశ్వరరావు గారింటికి వచ్చి భిక్షను గ్రహించినారు. అపుడు నేను “స్వామి! ఈరోజు అయోధ్యలో శిలాన్యాసము గదా. ఏమి గందరగోళం జరుగుచున్నదో” అన్నాను. స్వామి “అయోధ్య అనగా యుద్ధము లేనిది అని అర్థము” అని వివరించారు. సరిగ్గా 3 గం॥కు శ్రీరాముని, హనుమంతుని కీర్తిస్తూ స్వామి భజనలు చేశారు. సాయంత్రం 4 గం॥ అయినది. భజన చేస్తున్నంతసేపు అక్కడ ఎట్టి అల్లర్లు జరుగకుండా స్వామి బాణాలు రెండుచేతులతో వేస్తూనేయున్నట్లు చేతులు కదిలించుచున్నారు. “సాయంత్రం టీవీలో చూడండి రక్షణబాణాలు వేసాను గదా” అన్నారు. ఫణి ఇలా అన్నాడు. “స్వామీ! 2.15కు ముహుర్తం అంటున్నారు కదా! మీరు 3 గం॥లకు భజన ఆరంభించి రక్షణబాణాలు వేసాను అంటున్నారు గదా? ఇదేమిటి స్వామి?” అన్నాడు. ఫణికి స్వామి దివ్యదృష్టినిచ్చి అయోధ్యలో శిలాన్యాసకార్యం చూపించినారు. కొన్ని అనివార్యకారణాల వల్ల శిలాన్యాసం 1.15 ని॥లు ఆలస్యంగా తోసుకుపోయి 3.30 కే జరిగినది. ఫణికి అయోధ్యలో కోతులు మందలు, మందలుగా నిలచి కనిపించినవట.
స్వామి సంకల్పముతో సీతమ్మగారికి అయోధ్యను రక్షించుచున్నట్లు హనుమంతులవారు కనిపించారు. “ఏమి కనిపించినదో చెప్పు” అని స్వామి ఆదేశించగా సీతమ్మగారు చెప్పినారు. మన భజన మధ్యలోనే శిలాన్యాసం జరిగినదని ఫణికి 4 గం॥ సమయంలోనే స్వామి చెప్పినారు. ఆ రోజు విశ్వామిత్రుల నుండి పొందిన సమస్త దివ్యాస్త్రములను ప్రయోగించానని స్వామి చెప్పినారు. ఆ రోజు సాయంత్రం టీ.వీ. లో చూచిన సత్యం 3.30 గం॥లకు జరిగిన శిలాన్యాసం. ఇది స్వామి సాక్షాత్తు శ్రీరాముడుని చెప్పటానికి ఒక చక్కటి నిదర్శనము.
★ ★ ★ ★ ★