04 Jun 2025
స్వామి సాక్షాత్తు శ్రీలక్ష్మీనరసింహుడే.
అజయ్ గారు పూర్వజన్మలో 1600 సం॥ క్రింద యోగానంద లక్ష్మీనరసింహాచార్యులు అను నామధేయంతో తిరుపతిలో ఉన్న అర్చకులని స్వామి చెప్పేవారు. ఒకరోజు అజయ్ గారు హఠాత్తుగా ఉదయం భార్య లక్ష్మితో “ఈ రోజు పానకం తయారు చేయి” అన్నారు. లక్ష్మి (అజయ్ గారి భార్య) “ఇదేమిటి? ఈ కోరిక! ఆఫీసుకు పోయే టైములో” అనుకొని పానకం చేయలేదు. ఆ రోజు స్వామి రాజమండ్రిలో ఉన్నారు. రాత్రి 9 గం॥ లకు విజయవాడ స్టేషనుకు వచ్చినారు. స్వామిని తీసుకుని వచ్చుటకు అజయ్ గారు స్టేషనుకు వెళ్ళారు. స్వామి అజయ్ గారి స్కూటర్ వెనుక ఆసీనులగుచూ “ఇప్పుడు నీ వెనుక సింహం కూర్చున్నది తెలుసా!” అంటూ ఆశువుగా దారి పొడుగునా "అహో పింగళాక్షాగ్ని జాజ్వల్యమానా...” అని ఆరంభించి నరసింహస్వామి వారి భజనను పాడినారు.
ఇంటికి రాగానే లక్ష్మితో “పానకం చేసి నైవేద్యం పెట్టు” అని ఆదేశించినారు! ఎంత విచిత్రము! ఉదయం సంగతి అప్పుడు గుర్తుకు వచ్చింది అజయ్ కు, లక్ష్మికీ! ఉదయం అజయ్ గారి ద్వారా తానే మాటలాడితినని చెప్పినారు. భక్తులనావేశించి భగవానుడు మాటలాడునని “తన్మయా హి తే” అను నారదభక్తిసూత్రాన్ని నిరూపించినారు స్వామి.
★ ★ ★ ★ ★