20 May 2025
[19-12-2002] మహిమలు అనగా కొన్ని వస్తువులను సృష్టించుట, కొన్ని దివ్య తేజో దర్శనములను చూపుట మొదలగు ఊహాతీత క్రియలు. ఇవి పంచభూతములకు సంబంధించినవే కావున జగత్తులోని భాగములే. ఈ జగత్తును సృష్టించుట ఒక మహాసిద్ధి. దానిలోని స్వల్పభాగములే అష్టసిద్ధులైన మహిమలు. జగత్ సృష్టియే బ్రహ్మమునకు స్వరూపలక్షణము కాదనియు అది కేవలము తటస్థలక్షణము అని రెండవ బ్రహ్మసూత్రము చెప్పుచున్నది.
అయితే స్వరూపలక్షణము అనగా నేమి? స్వరూపలక్షణము అనగా ఒక ప్రత్యేకమైన శరీరాకారము. "గంగడోలు కలది ఆవు" అన్నట్లు. అయితే తటస్థలక్షణమనగా నేమి? తటస్థలక్షణమనగా స్వరూపమునకు చేరియున్న అనిత్యమైన లక్షణము. "మువ్వల దండ కలది ఆవు" అన్నట్లు. ఆ మువ్వల దండను ఆవు మెడలో నుండి తీసి, గాడిద మెడలో వేసినచో, గాడిద ఆవు అగునా? కాదు, కాదు. గంగడోలును ఆవు నుండి వేరు చేయలేము గదా.
రాజు శరీరమున ఉన్న అలంకారములవలె, మహిమలు బ్రహ్మమునకు గుర్తు కాజాలవు. అలంకారములు ధరించినంత మాత్రమున పగటి వేషగాడు రాజు కాగలడా? కాడు, కాడు. అలానే పరమాత్మనుండి, మొండి బిడ్డలైన రాక్షసులు తపస్సు అను మొండి పట్టుదల ద్వారా సిద్ధులు పొందిన రావణాదులు పరమాత్మ అయినారా? కాలేదు గదా.
ఎట్టి సిద్ధులను ప్రదర్శించని శ్రీరాముని, స్వర్గమునే సృష్టించిన విశ్వామిత్రాది బ్రహ్మర్షులు, పరమాత్మగా గుర్తించలేదా? మరి, పరమాత్మను గుర్తించు స్వరూపలక్షణములేవి? "సత్యం జ్ఞానం", "రసో వై సః" ఇత్యాది శ్రుతులవలన జ్ఞాన ప్రేమానందాది కల్యాణ గుణములే పరమాత్మకు స్వరూపలక్షణములు.
రాక్షసాదులు మహిమలను చూపుచున్నప్పుడును వాటిని చేయుచున్నవాడు పరమాత్మయే. లైటును వెలిగించుచున్నది తీగెలో ప్రవహించు విద్యుత్తే కానీ, తీగెకాదు. ఇది తెలియక, రాక్షసాదులు, కార్తవీర్యార్జునాదులగు యోగులు, కేవలము తీగెలగు తామే కర్తలమని అహంకరించి పతనము చెందిరి. చివరకు పరశురాముడును సర్వ క్షత్రియ సంహారము తానే చేసెనని గర్వించి, శ్రీరాముని చేత గర్వభంగము పొందెను. శ్రీరాముడెప్పుడును గర్వమును పొందలేదు.
హనుమంతుడు తానెట్టి అద్భుత సిద్ధులను ప్రదర్శించినా, తాను తీగె మాత్రమేనని గుర్తించి “దాసోஉహమ్మని” ఆ సిద్ధుల కర్తృత్వమును పరమాత్మకే అంటకట్టినాడు. కావున హనుమంతుడు సదా విజయమును పొందెను. చివరకు పరమాత్మయగు శ్రీరాముడును యుద్ధము చేసి హనుమంతునకే విజయమునిచ్చినాడు! తండు మహర్షి దర్భలను కోయుచుండగా తన పిడికిలి నుండి గుప్పెడు విభూతి సృష్టింపబడగా దానిని తానే సృష్టించెననుకొని గంతులు వేయసాగెను! శంకరుడంతట సాక్షాత్కరించి బొటనవేలు నుండి విభూతికొండను సృష్టించగా తండువు శంకరుని పదములపై పడెను. శ్రీరాముని చేత జయించబడిన పరశురామునికి, శ్రీరాముడినే జయించిన హనుమంతునికి భేదము తెలుసుకున్నవాడు జ్ఞాని. ఈ హనుమంతుడి మార్గములోనే నడచి సదా దాసోஉహమ్మని శిరిడిసాయి కూడా ఎప్పుడు “అల్లా మాలిక్” అనేవాడు. తాను హనుమంతుని దత్తపుత్రుడేననియు, వర్షముపడుచున్నను హనుమంతుని విగ్రహమున్న పైమెట్టున కూర్చొనక, భగవంతునియందు ప్రపత్తినే ప్రదర్శించెను. కావున పరమాత్మనుండి సదా కీర్తిని, విజయమునే సాయి పొందగలిగినాడు.
ఇట్టి ప్రపత్తి భావమును అవతారములగు హనుమదాదులు కలిగియున్నను, వారిని ఆరాధించు భక్తులు వారిని పరమాత్మ స్వరూపములుగనే ఆరాధించవలెను. ఏలననగా, వారు విద్యుత్తీగలే కావచ్చు. కాని, విద్యుత్తీగెను ఎచ్చట తగిలిననూ షాక్ కొట్టును. కావున విద్యుత్తుకు తీగెకు అద్వైతమే. తీగెను విడచిన విద్యుత్తు మనకు అందనిది. తీగె ద్వారానే విద్యుత్తును స్పృశించగలము. ఇదే అవతారతత్త్వము. విద్యుత్తీగెయును మామూలు తీగెవలె సన్నగా వంకరలు తిరిగియుండు ధర్మములు కలిగియున్ననూ వాటిని చూచి విద్యుత్తీగెను మామూలు తీగెయని భ్రమించరాదు. అట్లే రామ, కృష్ణాది అవతార శరీరములు సైతము, ఇతర శరీరములవలె ప్రకృతి ధర్మములను కలిగి యున్నంత మాత్రమున వారిని సామాన్య జీవులని భ్రమించరాదు.
అజ్ఞానులగు నాస్తికులను ఆస్తికులుగా మార్చుట కొరకు చేయు ఈ సిద్ధులు ఆరంభావస్థకు సంబంధించినవి. ఆస్తికుడు జ్ఞాన – భక్తిలనెడి రెక్కలతో భగవత్ర్పాప్తిని పొందవలెను. కావున వారికి సిద్ధులు అనవసరమే కాక, హానికరము కూడ. ఆస్తికులు ఈ సిద్ధులను పొంది అహంకరించి పతితులగుట చాల సులభము. లేక వారు ఈ సిద్ధులు కలవాడిని చేరి తమ స్వార్థములగు, ఐహికములను సాధించుకొనుచూ మరింత స్వార్థము పెంచుకొని పరమాత్మకు దూరమగుదురు. జ్ఞానము చేత గలిగిన ప్రతిఫలాపేక్ష రహితమైన భక్తియే వారికి మార్గము.
యమున నీలవర్ణ. ఈ నీలపురంగు తమోగుణ సూచకము. మహిమలు తమోగుణులైన పామరులకు సంబంధించినవి కావున “మహిమ యమున” యని దీనికి నామకరణము చేయుట జరిగినది.
“అష్ట సిద్ధుల అవసరమేల? సుందరాకృతికి సొమ్ములు ఏల?
జ్ఞాన (భక్తి) యోగమే నా సౌందర్యము జ్ఞానులు (భక్తులు) దత్తుని గుర్తించెదరు.”
స్వామి ఎన్ని అష్టసిద్ధులు ప్రదర్శించినా ఎంత ఉన్నతబోధ చేసినా దుర్యోధనాదులు విశ్వసించలేదు. తను ప్రదర్శించిన విశ్వరూపమును గారడి విద్యగా భావించినారు. కావున జీవునకు శ్రద్ధలేకుండా, పరమాత్మ ప్రయత్నించినను ప్రయోజనము లేదు. జీవుడు మొదటి అడుగు పరమాత్మవైపుకు వేయుటయే ఈ శ్రద్ధను కలిగియుండుట. అప్పుడు పరమాత్మ జీవునివైపుకు 100 అడుగులు వేయును. పరమాత్మయే మొదటి అడుగు వేస్తే జీవులు పరమాత్మను సైతం విశ్వసించక నిర్లక్ష్యముతో పరాభవిస్తారని “అవజానంతి మాం మూఢాః" అని గీతలో చెప్పబడినది. సిద్ధులను ప్రదర్శించినప్పుడు భయము, ఆశ్చర్యము కలుగునే తప్ప ఆనందము, ప్రేమ కలుగవు. ఆనంద- ప్రేమలు, జ్ఞాన - భక్తి తత్త్వముల ద్వారా కలుగును. భయము కన్నను భక్తి గొప్పది. అంతిమక్షణములో పరమాత్మ తనను రక్షించడన్న భయంతో పరమాత్మను సేవించుటకన్నను, ఎట్టి ప్రతిఫలాపేక్షలేక కేవలము భగవద్గుణ జ్ఞానముతో ఏర్పడిన ఆకర్షణరూపమైన ప్రేమ యను భక్తి కలుగుటవలన పరమాత్మను సేవించుట అత్యుత్తమము. "భక్త్యా త్వనన్యయా లభ్యః" - ఇట్టి భక్తికి పరమాత్మ లభించును అని గీత. జ్ఞానము వలన భక్తి ఏర్పడును. భక్తివలన పరమాత్మ లభించును. కావున జ్ఞానము మూలకారణము, భక్తి ప్రాప్తికారణము. స్వామి భక్తుల రోగములను తీసివేయునప్పుడు వారి కర్మఫలములను తరువాత జన్మలకు తోసివేయును. దాని వలన ఆ కర్మఫలములు మరింత వడ్డీతో అనుభవించవలయును. మహాభక్తుల కర్మఫలములను స్వామి తానే అనుభవించును. ఈ రెండు పద్ధతులను జ్ఞానియైన భక్తుడగు జీవుడు అంగీకరించడు కావున తన కర్మఫలములను తానే అనుభవించకోరును.
స్వామి సృష్టించు తేజస్సు మొదలగునవి, స్వామి సృష్టించిన సూర్యచంద్ర నక్షత్ర తేజస్సుల ముందు అల్పములు కావున జ్ఞాని ఈ మహాసృష్టియే స్వామి యొక్క మహాసిద్ధిగా భావించి అల్పములగు అష్టసిద్ధులను చూడకోరడు.
“జ్ఞానమే నా సహజ సత్య స్వరూపం,
ప్రేమయే నా సహజసత్య సౌందర్యం.
ఈ రెండె నను బట్టగా గుర్తులిచ్చట,
నా అలంకారాలె యీ అష్టసిద్ధులు.
సహ్యాద్రి వాసిని నేను - సాక్షాత్తు దత్తుడు నేను”.
స్వామి
(ౙన్నాభట్ల వేణుగోపాల కృష్ణమూర్తి)
★ ★ ★ ★ ★