home
Shri Datta Swami

 21 May 2025

 

స్వామి బాల్య జీవిత విశేషాలు

Updated with Part-3 on 23 May 2025


Part-1   Part-2   Part-3


Part-1

శ్రీ దత్తస్వామి అని కొంతకాలము పిలువబడిన శ్రీ వేణుగోపాల కృష్ణమూర్తి గురుదేవులను భక్తులందరూ “స్వామి” అని పిలుస్తారు సంక్షేపముగా. స్వామిగా వ్యయనామ సంవత్సర ఫాల్గుణ శుక్ల విదియ ఆదివారమునాడు ఉషఃకాలములో ఉత్తరాభాద్ర 4వ పాదములో, మకరలగ్నములో శ్రీదత్తపరబ్రహ్మమే అవతరించినారు. వీరి తండ్రిగారు శ్రీ వీరభద్రయ్యశాస్త్రి గారు. సంస్కృతాంధ్ర భాషలందు ఆశుకవీశ్వరులు. శతాధిక గ్రంథకర్తలు. మహాజ్యోతిష పండితులు. వీరి తల్లిగారు శ్రీమతి హనుమాయమ్మ గారు. ఇంటిపేరు న్నాభట్ల వారు. కాశ్యపగోత్రము. గుంటూరుజిల్లాలోని వినుకొండ తాలూకాలోని నాగులవరము వీరి జన్మగ్రామము. ఈ గ్రామము పూర్వకాలమున నాగులపుట్టలతో నిండియుండెనట. ఇది తక్షకుని నుండి గోవును దక్షిణగా గ్రహించి, పరీక్షిత్తును రక్షించుట విధి నియమ విరుద్ధమని అర్థించిన తక్షకుని ఆశీర్వదించి కశ్యపుడు వెనుతిరిగిన స్థలమట.

1. స్వామి జననం – దుర్మార్గుల మరణం

స్వామి తాతగారు శ్రీ కోటేశ్వరశాస్త్రి గారు. నిరంతర రామనామ జపతత్పరులు. వీరు మరణించినపుడు రామనామమును లెక్కించుచు వేలు చేతిమీద నిలచియుండెనట! వీరి కుటుంబమున కొందరు దుర్మార్గులు చేతబడులతో బాలురను సంహరించుచుండగా, స్వామి అష్టమగర్భమున జన్మించినారట. స్వామి జన్మించగనే ఆ దుర్మార్గులు మరణించిరి. స్వామికి 5-6 సంవత్సరముల వరకు పేరుపెట్టలేదు. స్వామి ఊరిలోను, ఇంటిలోను వెన్న దొంగిలించుటవల్లను, స్వామి వారి మేనత్త శేషమ్మగారు స్వామికి "వేణు గోపాల కృష్ణుడని” నామధేయమును నిశ్చయించినారట.

స్వామి అల్లరి శాంతించవలయునని ఉపనయనమును చేసి గ్రామవాసులందరికిని అన్నదానమును చేసినారు. స్వామికి సంస్కృతమును బోధించవలయునని తండ్రిగారు చెప్పిన 8 శ్లోకములతోనే స్వామి ఆ చిన్ననాడు తదుపరి శ్లోకములను సమన్వయించిరట.

సంస్కృతములో ఆశుకవిత్వం ప్రవహించుచుండగా, కావ్యాలను, స్తోత్రాలను, వేదాంతశాస్త్ర గ్రంథములను శతాధికంగా ఎల్లప్పుడూ స్వామి వ్రాయుట ప్రారంభించిరి. 11 సంవత్సరములలో స్వామి వ్రాసిన కావ్య శ్లోకములను చూసి సంస్కృత పండితులు ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీ మద్దులపల్లి సత్యనారాయణశాస్త్రి గారు, శ్రీ తాతాచార్యులు గారు మొదలగు మహాపండితులు స్వామి శ్లోకములు కాళిదాస శ్లోకములను మరిపింప చేయుచున్నవని పలకటం ఆనాటి విశేషం. శ్రీ వావిలాల వెంకటేశ్వరశాస్త్రి గారను గొప్ప వేదాంతపండితుడు "ఇతడికి సర్వ శాస్త్రములు కరతలామలకములు" అని ప్రశంసించారు కూడా. శ్రీ దోర్బల ప్రభాకరశర్మ గారు, న్నాభట్ల వీరేశ్వర శాస్త్రి గారు మొదలగు మహాపండితులెందరో స్వామి దైవికమైన ప్రతిభ కలవాడని వేనోళ్ళ పొగిడినారు. మచ్చుకు కొన్ని శ్లోకములు స్వామి గ్రంథములగు

i) వైయాసకమ్ నుండి

ఉపత్యకాభూత జగత్ర్తయేஉపి, నేత్రత్రయావేక్షిత జంతుజాలమ్ |
అధిత్యకాయాం హి జటాసటాభిః, సాక్షాన్మహా సింహమివోపవిష్టమ్ - (శివ వర్ణనమ్) ।।

ఉల్లంఘయం శ్చిత్ర విచిత్రరీత్యా, బృందావనే గోపవధూజనాన్వా |
తురంగమాన్కర్ణరథావరోధం, ముహుర్ముహుః పర్యహరన్మురారిః || (సైంధవవధ సందర్భంలో కృష్ణుడు రథమును నడుపుట)

తరణిః కిరణేన తచ్ఛిరో - ధృతమాణిక్యరుచం ప్రకాశయన్ |
సమదర్శి రహస్య జన్మనే, స్వసుతాయేవ కరేణ వహ్నిదః || (కర్ణ వధానంతర సందర్భము)

ii) శ్రీ కృష్ణభాగవతమ్ నుండి
వీరాయ కంసాదినిశాచరాణాం, మారాయ రాధాదిమనస్వినీనామ్ |
పారాయ సంసార మహాంబురాశేః, చోరాయ జారాయ తపశ్చరామి ||

పింఛావిష్కృత శేఖరాయ తులసీ హారాయ, పీతాంబర –
వ్యానద్ధాయ కటే రథః కరతలే పారిప్లవద్వేణవే |
సాయంకాల వనాంతరాగత గవాం పశ్చాత్కృతాయ వ్రజైః
వామాలోకన వామలోచనకృత స్పందాయ తే వందనమ్ ||

పాదక్షేప ఝలత్ ఝలధ్వనిరయై రానంద మాతన్వతే
ముక్తామేఖలయా విశిష్టకలయా చక్షుస్సమాకర్షతే |
ఆలిప్తాయ పయోభి రంతిమ గృహద్వారాద్బహి ర్ధావతే
కస్మైచిన్మహసే నమాంసి మహతే బాలాయ నీలాయ తే ||

స్వామి 10 సం॥ ప్రాయములోనే భవిష్యత్తును చెప్పేవారు. తండ్రిగారి జ్యోతిషశాస్త్రము అలవడటము అని అందరూ అనుకొనేవారు. కానీ ఆ సంఘటనలు మచ్చుకు రెండు వింటే - జ్యోతిషానికి అతీతమైన దైవశక్తి మనకు గోచరిస్తుంది.

 

Part-2

2. జ్యోతిషానికి అతీతమైన దైవశక్తి:

స్వామి గ్రామానికి పక్క గ్రామమైన కూకట్లపల్లిలో ఒక రైతు స్వామి ఇంటికి వచ్చి స్వామి తండ్రిగారికి తన కూతురి పెండ్లి శుభలేఖను ఇస్తున్నాడు. 10 సం॥ బాలుడైన స్వామి  అక్కడే ఉన్నాడు. “పెండ్లికూతురు పెండ్లి కాగానే మరణిస్తుంది కదా. ఎందుకు ఈ పెండ్లి?” అని అన్నారు. ఆ రైతు నిర్ఘాంతపోయినాడు. ఇంటిలో అందరూ స్వామిని మందలించినారు. ఆ రైతు తిరుపతిలో స్వామి సన్నిధిలో పెండ్లి చేసాడు. పెండ్లి కాగానే, పెండ్లికూతురు అత్త మామలకు నమస్కరిస్తూనే బోర్లాపడి ప్రాణాలు విడచినది! ఈ సంఘటనతో ఆ గ్రామమంతా అట్టుడికినది! అలానే, అదే వయస్సులో స్వామి పక్క గ్రామమైన కుందుర్తిలోనున్న మేనమామ గారింటికి పోయినారు. ఆయన ఇంటిలోని ఒక డైరీ తీసుకొని ఫలానా తేదినాడు అత్తయ్య కలరాతో మరణించును అని వ్రాసి సంతకము చేసి ఆనాటి తేది కూడ వ్రాసినారు స్వామి. ఆ విషయమును మేనమామ చూడలేదు ఆనాడు. అలానే ఆ తేదీనాడు కలరాతో ఆమె మరణించినది. తరువాత మేనమామ తన డైరీ చదువుచుండగా ఆ విషయము బయటపడినది.

Swami

3. శ్రీ కరపాత్ర స్వామి వారు శ్రీ దత్తస్వామిని పీఠమునకు ఉత్తరాధిపతిగా ఆహ్వానించుట

స్వామి 19 సంవత్సరముల వయస్సులో కెమిస్ట్రీలో పి.హెచ్.డి. డిగ్రీని సంపాదించి విశ్వములో విశిష్ట స్థానమును పొందటము ఎంతటి ప్రతిభ! విద్యాభ్యాసం వల్ల కాశీ, ప్రయాగలలో 5 సంవత్సరములు నివసించి ప్రతిదినము గంగాస్నానము, రుద్రాభిషేకములను చేసేవారు. స్వామి 15-16 సం॥ ప్రాయములో ఎందరో పండితులతో శాస్త్రార్థములను చేసి అచట పండితులకాశ్చర్యమును కలిగించినారు కూడా. "తత్తు సమన్వయాత్” అను బ్రహ్మ సూత్రమున నున్న 'తు' శబ్దమునకు 102 అర్థములను చెప్పగా వాటిని కాశీ పండితుల వేదాంతపత్రికలో ప్రచురించి గౌరవించినారు. కాశీ పీఠాధిపతియగు శ్రీ కరపాత్ర స్వామి వారు స్వామిని సంన్యసించి పీఠమునకు ఉత్తరాధిపతిగా రమ్మని కోరటం వీరి ప్రతిభకు నిదర్శనం కాదా? స్వామియును సిద్ధమై తండ్రిగారికి తెలుపగా, పెద్దకొడుకు కావున అంగీకరించలేదు. ఇది దైవనిర్ణయము కాకపోతే మరేమిటి? మనబోంట్లను ఉద్ధరించవలసిన కార్యం ముందు ఉండగా స్వామి ఎలా సంన్యసిస్తారు ఆ రోజున? ఇది మన అదృష్టం కాదా?

 

Part-3

4. ఆర్య సమాజ పండితులతో వాదము

ప్రయాగలో మహాకుంభమేళ జరిగినది. ఆర్యసమాజము - సనాతనధర్మములను రెండు పక్షములకును వాదోపవాదములు జరిగినవి. ఆర్యసమాజము నిరాకారుడగు ఈశ్వరునే విశ్వసించును. సాకారము కానీ, నరావతారములను కానీ విశ్వసించదు. సనాతనధర్మము సాకార, నరావతారములను విశ్వసించును. (ఆర్యసమాజ పండితులతో 16 సం॥ స్వామి సంస్కృతములో వాదించినారు.) ఆ వాదములో ఒక చిన్న సందర్భము.

స్వామి:- ఈశ్వరుడు సర్వశక్తిమంతుడా? కాడా?

ఆర్యసమాజ పండితులు:- ఈశ్వరుడు సర్వశక్తిమంతుడే. ఇది అన్ని మతములకు అంగీకారమే.

స్వామి:- అన్ని శక్తులున్న ఈశ్వరుడు ఆకారముగా మారగల శక్తిని, మరియు అవతారములనెత్తు శక్తిని కలవాడే అయి ఉండవలెను. అట్టి శక్తి లేదన్నచో ఈశ్వరుడు సర్వశక్తిమంతుడని అంగీకరించలేము గదా. ఆ శక్తి లేనివాడు అనవలసివచ్చును.

ఆర్య స. పం.:- శక్తి యున్ననూ అవసరమున్ననే ఈశ్వరుడు దానిని ఉపయోగించును. ఈ సందర్భములో అవసరములేదు కాన ఆ శక్తిని ఉపయోగించలేదు.

స్వామి:- కాదు. అవసరమున్నది. నిరాకారుని ధ్యానించలేము. కావున సాకారుడైన ఈశ్వరుడు కావలయును. సాకారములగు విగ్రహాదులు దర్శన, స్పర్శలనే ఇచ్చుచున్నవి. వీటితోబాటు సంభాషణ, సహవాసములను ఇచ్చుటకు ఈశ్వరుడు నరునిగా అవతరించుచున్నాడు.

ఆర్య స. పం.:- "న తస్య ప్రతిమా”, “అరూపం”, “న చక్షుషా” ఇత్యాది శ్రుతులు ఈశ్వరుని నిరాకారమును చెప్పుచున్నవి.

స్వామి:- "యత్సాక్షాత్", "ప్రత్యగాత్మానమైక్షత్" ఇత్యాది శ్రుతులు బ్రహ్మము ప్రత్యక్షమనియు, కంటితో చూచిరని చెప్పుచున్నవి. నిరాకారమును చెప్పు శ్రుతులు ఈశ్వరునితో అభిన్నమైన ఈశ్వరశక్తిని గురించి చెప్పుచున్నవి.

ఈ వాదముతో ఆర్యసమాజ పండితులు నిరుత్తరులైనారు.

Swami

5. స్వామి ఒక అద్వైతమత పీఠాధిపతితో సంస్కృతములో వాదించిన సందర్భము

పీఠాధిపతి:- అజ్ఞానియగు సామాన్య జీవుని చూచి తండ్రి "తత్త్వమసి” - “నీవు ఆ బ్రహ్మమైయున్నావు” అని అన్నాడు కదా. కావున సామాన్య జీవుడును బ్రహ్మమే.

స్వామి:- తత్త్వమసి (తత్+త్వమ్+అసి) అను వాక్యములో “అసి" (you are) అను ధాతువునకు “లట్” (present tense) అర్థమును “అతి త్వరలో కాగలవు" అని వ్యాకరణ సమ్మతమే కావున భవిష్యదర్థములో (future tense) తీసుకొనవలెను. ఇక్కడ తండ్రి తన అతివాత్సల్యము వలన అతిత్వరలో పుత్రునికి బ్రహ్మత్వము సిద్ధించవలెను అని అనువాకాంతమున ఆశీర్వదించి ముగించుచున్నాడని గుర్తించవలెను.

ఈ వివరణముతో ఆ పీఠాధిపతి ఆశ్చర్యపడి స్వామిలోనికి అతినిశితముగా చూచి దత్తదర్శనమును పొంది సంతృప్తి పడి "నీవు త్రిమతములను సమన్వయించి సిద్ధాంతమును స్థాపించగల సమర్థుడవు" అని ప్రశంసించెను. ఆదిశంకరులకు శ్రీదత్తుడు చండాలవేషమున బోధించిన ఘట్టము ఇచ్చట స్ఫురించుచున్నది. "తత్త్వమసి" అను వాక్యము అద్వైతమతమునకు పెట్టని కోట. దీనిని వేరొక మార్గములో అన్వయించి స్వామి త్రిమత సమన్వయ సిద్ధాంతమును ప్రతిపాదించుచు సంస్కృతములో అనేక గ్రంథములను రచించిరి. మొదటిదశలో స్వామి ఎల్లప్పుడును సంస్కృత పండితులతోనే చాలాకాలము వరకు వేదాంత శాస్త్రములో చర్చలు, వాదములు, సత్సంగములను చేయుచుండిరి. రెండవదశలో పామరులనుద్ధరించదలచి ‘దత్తవేదము’, ‘దత్తగురు భగవద్గీత’, ‘దత్తోపనిషత్తు’లను తెలుగు తాత్పర్యసహితముగా రచించి జ్ఞానమార్గమును భక్తులచేత ప్రచారము చేయించినారు. గోపీగీతలను, భక్తి గంగలను గ్రంథముల ద్వారా భక్తిమార్గమును ప్రచారము చేయించినారు.

స్వామి 30 సం. ప్రాయములోనే రసాయన శాస్త్రములో ప్రొఫెసరు పదవి నలంకరించెను. స్వామి ధర్మపత్ని శ్రీమతి జయలక్ష్మి నరసకుమారి. ముగ్గురు పుత్రులు చి. ఆంజనేయ, వీరభద్ర, వత్సార ఋషి నామధేయులు. పుత్రిక చి. సౌ. హనుమాయమ్మ. సామాన్య మానవునకు ముక్తిమార్గమును ఉపదేశించుచు, "తన కర్తవ్యములకును, విశ్రాంతికిని పోను మిగిలిన సమయమును టీవీ, సినిమాలు, కథల పుస్తకములను చదువుట, వ్యర్థ సంభాషణములు అను వ్యసనములందు దుర్వినియోగము చేయక, సాధనకు సమర్పించిన చాలును, జీవుడు తరించగలడు. సాధనయనగా స్వామి నుండి ఎట్టి ప్రతిఫలమును ఆశించక, కేవలము స్వామి కల్యాణగుణములచే ఆకర్షింపబడి, స్వామి వలన కష్టనష్టాలు వచ్చినా స్వామిని త్యజించలేని మహావ్యసనము అగు నిరంతర ప్రేమధారా భక్తి ప్రవాహమే” అని అంటారు స్వామి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch