22 Jun 2025
భక్తురాలిని మృత్యుముఖమునుండి కాపాడుట.
[శ్రీ రమణ, శ్రీమతి సుజాత]
మా దంపతులము, మా తృతీయపుత్రుడు చి॥ రమణ, కోడలు సుజాత, పిల్లలు కలసి హైదరాబాదులో బాగ్ లింగంపల్లిలో మా స్వగృహంలో ఉన్న రోజులవి. ఒకసారి స్వామి హైదరాబాదు వచ్చి మా గృహాన్ని పావనం చేసారు. ఆ సమయములో దైవస్వరూపురాలు శ్రీమతి సత్యకుమారిగారు వచ్చారు. ఆవిడ స్వామికి నమస్కరించి కూర్చున్నారు. అపుడు, స్వామి నుండి విపరీతంగా శక్తికిరణాలు బయటకు ప్రసరిస్తూ ఉండటం ఆమె ప్రత్యక్షంగా చూసారు. వెంటనే ఆమెపై శ్రీదత్తప్రభువు ఆవేశించినారు. ఆమె బాగా కంపించసాగినది. అప్పుడు స్వామి ఆమెతో ఇలా వచించారు.
స్వామి:- మీరెవరు స్వామి?
ఆమె:- నేను దత్తాత్రేయుడను.
స్వామి:- మరి, నేను ఎవరు?
ఆమెలోని (దత్తదేవుడు) “నీవే నేను, నీవే నేను, నీవే నేను” అని మూడు పర్యాయములు వచించారు. తర్వాత ఆమె మామూలు మనిషి అయినారు. అప్పుడు స్వామి ఆమెతో ఇట్లా వచించినారు. “ఈరోజు నీకు సమయము ఆసన్నమైనది. సిద్ధముగా నుండుము” అన్నారు. ఈ సంభాషణ వింటున్న మేము తికమక పడ్డాము. మాకేమీ అర్థం కాలేదు. సరే! ఏం జరుగుతుందో చూద్దామని మిన్నకున్నాము. ఆమె ఇంటికి వెళ్ళినది. రాత్రి 12 గం. అయినది. ఆమె ఫోను చేసి “స్వామీ! నా పని అయిపోయింది” అని నీరసంగా మాట్లాడినది. ఆమె మృత్యుముఖంలో పడినది. స్వామి ఆమెకు ఫోనులో అభయమిచ్చినారు. ఉదయానికే ఆమె పరిపూర్ణ స్వస్థతను పొందినది! ఆవిడ ధన్యురాలు!!
★ ★ ★ ★ ★