home
Shri Datta Swami

 07 Nov 2025

 

శ్రీదత్తజయంతి సందేశము

Updated with Part-4 on 10 Nov 2025


Part-1   Part-2   Part-3   Part-4


Part-1

జ్ఞానులైన మరియు భక్తులైన భగవత్ సేవకులారా

అత్రి అనసూయలకు మానవస్వరూపములో అందరాని పరబ్రహ్మము అందినరోజే దత్తజయంతి. ‘జయంతి’ అనగా ఆ మానవాకారము సంభవించిన రోజు. అనగా సాక్షాత్కరించిన దినము. అనగా అట్టి మానవాకారములో ఉన్న సద్గురువు నీకు లభించిన రోజు. అట్టి సద్గురువును దర్శించు ప్రతిదినము దత్తజయంతే. అట్టి సద్గురువు సాన్నిధ్యములో ఉండి ఆయనను నిత్యము సేవించు ప్రతిరోజు దత్తజయంతియే. దత్తుడనగా ‘లభించినవాడు’ అని అర్థము.

జయంతి అన్ననూ అదే అర్థము. ‘మార్గశీర్షము’ అనగా మార్గమునందు శీర్షమును ఉంచుట. అనగా భగవంతుని చేరు సత్యమైన మార్గమునందు బుద్ధిని ప్రసరింపచేయుట అని అర్థము. నేడు మృగశిరా నక్షత్రము పూర్ణిమతో చేరినందున మార్గశీర్షమైనది. ‘మృగశిర’ అనగా మృగము యొక్క శిరస్సు. అనగా ‘పశుబుద్ధి’ అని అర్థము. ‘నక్షత్రములు’ అనగా అల్పజ్ఞానము గల జీవులు అని అర్థము. ‘పూర్ణచంద్రుడు’ అనగా వారి మధ్య పూర్ణజ్ఞానము గల సర్వజ్ఞుడగు పూర్ణచంద్రుడయిన అవతారపురుషుడని అర్థము. అట్టి అవతారపురుషుడు లోకమునకు అందించబడిన పరమాత్మయే కావున దత్తుడనబడుచున్నాడు. అయితే అట్టి అవతారపురుషుని లోకమునకు అందించిన వాడు ఎవరు?

అందించబడిన వాడే అందించినవాడు. అనగా స్వయముగా తనను తాను దత్తము చేసుకొనినవాడు అని అర్థము. ఇట్లు పరమాత్మ తనను తాను అందించుకున్న స్వరూపమును అసూయ, అహంకారములతో విడచిపెట్టి ఒక మానవుడు ఊహించి, చెక్కిన శిల్పములను, గీచిన చిత్రములను సేవించుట ఎంతటి వెర్రితనము. ఇవి అన్నియు ఊహాచిత్రములే కాని కనీసము తీసిన ఫోటోలు కూడా కావు. కావున మానవుడు అందించిన ఊహారూపములగు జడములను సేవించుట పామర లక్షణము. భగవంతుడు నిర్మించిన రూపములగు ప్రాణులలో సాత్త్వికులగు సాటి మానవులకును, పశుపక్ష్యాదులకును సేవ చేయుట ఉత్తమధర్మమగు ప్రవృత్తిమార్గము.

Swami

ఇక నివృత్తిమార్గములో ఇట్టి చైతన్యసహితములగు విగ్రహములకు ప్రతినిధిగా ఒకానొక స్వరూపముతో పరమాత్మయే అవతరించియున్నాడు. అట్టి అవతారపురుషుని గుర్తించి, సేవించు మోక్షమార్గమే “నివృత్తి” అనబడుచున్నది. “ప్రవృత్తి” అనగా సర్వసాధుప్రాణివర్గమును సేవించి లోకమునకు శాంతిని అందించుట. నివృత్తి అనగా ప్రాణులలో ఒకానొక ప్రాణి రూపమున ఉన్న పరమాత్మను సేవించి తరించుట. మానవుడు సాటి మానవుని ద్వేషించుచున్నప్పుడు, ఇక మానవరూపములో యున్న పరమాత్మను ఎట్లు గుర్తించి సేవించగలడు? కావున ప్రవృత్తియే తెలియని వానికి నివృత్తి ఎట్లు లభించును? ఉట్టికి ఎక్కలేని అమ్మ స్వర్గమునకు ఎక్కునా? దీనికి గీత “ప్రవృత్తిం చ నివృత్తిం చ”అని చెప్పుచున్నది.

ఈ ప్రవృత్తికి, నివృత్తికి మధ్య అడ్డుగోడలే అసూయ, అహంకారములు. అసూయ లేని జీవుడే అనసూయ. మూడు గుణముల అహంకారము లేనివాడే అత్రి. చైతన్యస్వరూపమైన జ్ఞానగర్వమే ‘సాత్త్విక అహంకారము’. శక్తిస్వరూపమైన బలము యొక్క మదమే ‘రాజస అహంకారము’. జడమైన శరీరదర్పమే ‘తామస అహంకారము’. అట్లు అసూయ అహంకారములు లేని సాధకుడే అనసూయ, అత్రి స్వరూపుడు. అట్టి సాధకుడే సాటి మానవరూపములో యున్న సద్గురువును పొందగలడు. అట్టివానికే సద్గురువు దత్తమైనాడు లేక లభించినాడు.

 

Part-2

ఇట్టి అంతరార్థమును తెలుసుకొనక, ఆచరించక అత్రి, అనసూయ అను దంపతులకు ఒక శిశువు జన్మించు ఉత్సవమును పిండివంటలతో చేసుకొనుట పసిబాలుర వినోదము కొరకు చెప్పబడిన ఒక అవిచారిత రమణీయమైన కల్పన. ఇట్టి కల్పనల స్థాయికి ఉత్తమసాధకులు కూడా దిగజారుట వారికి ఎంత అవమానమో వారికే తెలియకున్నది. ఉద్యోగములో పై పదవి నుండి క్రింద పదవికి లేక ఒక విద్యార్థి పైతరగతి నుండి క్రింది తరగతికి దిగజారుట అను డిమోషన్‌ ఎంత అవమానమో ఇదియును అంతే.

కావున ఇట్టి మానవాకారమున అంది వచ్చిన దైవస్వరూపములను సేవించుట తప్ప మరియొక మార్గము లేదు అను శ్రుతి “నాన్యః పంథా” అని చెప్పుచున్నది. అజ్ఞానాంధకారమును పోగొట్టు జ్ఞానసూర్యునిగా సద్గురువును వేదప్రమాణముల ద్వారా తెలుసుకొనవలెనని వేదము "వేదాహ మేతం పురుషమ్” అని చెప్పుచున్నది.

అట్టి సద్గురువును గుర్తించుటకు నాలుగు మహావాక్యములను ఆధారముగా తీసుకొనవలయును. ఇందులో మొదటి మూడు మహావాక్యములైన “అహం బ్రహ్మాస్మి”, “తత్త్వమసి”, “అయమాత్మా బ్రహ్మ”, ఆయన బాహ్యాకారము ఇతర మానవులవలె మానవస్వరూపమే అని చెప్పుచున్నవి. ఇక నాలుగవ మహావాక్యమైన “ప్రజ్ఞానం బ్రహ్మ” ఆయన ఇతర జీవులకు సాధ్యము కాని అతివిశిష్ట బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అని చెప్పుచున్నది. “సత్యం జ్ఞానమ్, ఆనందో బ్రహ్మ” అను శృతులు ఆయన బోధించు బ్రహ్మజ్ఞానము ఇతర పండితులవలె చెప్పు శిరోవేదనాకరమగు జ్ఞానము కాదని చెప్పుచున్నవి.

గీత కూడా “మానుషీం తనుమాశ్రితమ్‌” అని మానవుల కొరకు పరమాత్మ మనుష్యశరీరమును ఆశ్రయించి వచ్చునని చెప్పుచున్నది. మరియును గీత “భూతేజ్యా యాన్తి భూతాని” అను శ్లోకములో జడములగు పంచభూతముల స్వరూపములగు విగ్రహాదులను సేవించువారు జడములగుదురు, అనగా జడములగు పాషాణాది జన్మములలో జన్మింతురనియు, నరాకారమును గుర్తించి సేవించిన నరజన్మమును పొందుదురనియు చెప్పుచున్నది. విగ్రహములు, పటములు కేవలము దర్శనయోగ్యములే కాని సేవాయోగ్యములు కావు. దూరదేశమున ఉన్న బంధువుల ఫోటోల వంటివే. అట్టి ఫోటోలను దుమ్ము దులిపి శుభ్రముగా ఉండునట్లు విగ్రహములకు స్నానోపచారములు తప్ప మిగిలిన ఉపచారములు అక్కరలేదు.

శివలింగము అన్ని విగ్రహములకు మూలపదార్థము అగు శిలను సూచించుచున్నది. దానికి అభిషేకము తప్ప ఇంకొకటి అక్కరలేదు. కావున విగ్రహాదులు సాధనలో పరిమిత ప్రయోజనము కలిగియున్నవి. వాక్కులకు, మనస్సుకు, బుద్ధికి, ఊహకు కూడా పరమాత్మ అందడని వేదములు ఘోషించుచున్నవి. “న తత్ర వాగ్గచ్ఛతి”, “న మనో గచ్ఛతి”, “అప్రాప్య మనసా సహ”, “న మేధయా”, “నైషా తర్కేణ”, “న చక్షుషా” అను వేదవాక్యముల చేత చెప్పబడిన అట్టి పరమాత్మ మనుష్యశరీరమును ఆపాదమస్తకము వ్యాపించి భక్తులకు దర్శనము, స్పర్శ, సంభాషణము, సహవాసములను అనుగ్రహించుటకును, బ్రహ్మజ్ఞానము భోధించుటకును, తన భక్తుల పాపకర్మఫలములను తానే అనుభవించి అటు ధర్మదేవతకు న్యాయము చేయుచూ, ఇటు భక్తులను కర్మవిముక్తులను కావించుటకును, మానవ రూపములో అవతరించి “దత్తుడ”నబడుచున్నాడు.

వాతావరణములో కంటికి కనిపించని ఎలక్ట్రానులే అందరాని పరబ్రహ్మ స్వరూపము. ఆ ఎలక్ట్రానులే ఒక తీగెలో వ్యాపించి ప్రవహించునప్పుడు ఆ విద్యుత్తీగెయే అవతారమైన దత్తుడు. విద్యుత్తీగెను ఎచ్చట ముట్టుకున్నను షాకు కొట్టుచున్నది. కావున ఆ విద్యుత్తీగెయే మనకు స్పర్శనందించు అనుభవమును ఇచ్చు విద్యుత్తు. విద్యుత్తుకు, తీగెకు అద్వైతమే ఉన్నది. కావున విద్యుత్తే తీగ, తీగయే విద్యుత్తు. అట్లే మానవరూపియగు దత్తుడే పరమాత్మ. పరమాత్మయే మానవరూపుడైన దత్తుడు.

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఏసు, మహమ్మద్‌, బుద్ధుడు, మహావీరుడు, గురునానక్‌, శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీనరసింహ సరస్వతి, మాణిక్యప్రభువు, స్వామి సమర్థ, సాయిబాబా మొదలగు అవతారపురుషులే ఈ లోకమునకు అందించబడిన మానవరూపులగు దత్తస్వరూపములు.

ప్రతి మనుష్యతరమునకు ప్రతి దేశప్రాంతమునకును, అందరికినీ సులభముగానుండుటకు ఈ దత్తరూపములు గురువులుగా అవతరించుచునేయున్నవి. ఒక మానవతరమునకే ఒక దేశప్రాంతమునకే పరిమితమైనచో పరమాత్మకు పక్షపాతదోషము వచ్చును. ఈ అంతరార్థమును తెలుసుకొని ఆచరణలో తెచ్చుకున్న పవిత్రదినమే నిజమైన దత్తజయంతి.

 

Part-3

బ్రహ్మ, విష్ణు, శివముఖములతోయున్న దత్తుని స్వరూపమును చూచుచున్నారే గాని ఆ స్వరూపము యొక్క అంతరార్థమును మీరు గ్రహించుట లేదు. దత్తుడనగా, అందరాని పరబ్రహ్మము మనుష్యాకారములో అందివచ్చిన అవతారపురుషునిగా భక్తులకు దత్తమైనాడని అర్థము. ఆయన మూడు ముఖములు త్రిగుణములను సూచించుచున్నవి. సత్త్వగుణము మంచి గుణము. రజస్సు, తమో గుణములు చెడ్డ గుణములు. అనగా ఆ మనుష్య శరీరములో అన్ని గుణములు ఉన్నవనియే అర్థము.

గీతలో కూడా ప్రకృతియే మాయయనియు, ప్రకృతియే త్రిగుణములు అనియు, మాయ కలవాడే ఈశ్వరుడనియు, అట్టి ఈశ్వరుడు అవతరించినప్పుడు మాయాసహితుడై యుండుననియు చెప్పుచున్నది. ఈ మాయ సత్త్వగుణమేనని చెప్పుట సరికాదు. త్రిగుణమయమైన ఈ బ్రహ్మాండమంతయు అవతారపురుషుని యొక్క పిండాండములో ఉన్నట్లుగా విశ్వరూప ప్రదర్శనమున స్పష్టమగుచుండగా అవతారపురుషునిలో త్రిగుణములు ఉన్నవి అనియే అర్థము.

ఈ రజస్తమో గుణములు కూడా అవతారపురుషుని క్రీడలోను, మరియు భక్తులను పరీక్షించుటలోను ఉపయోగపడును. శ్రీరాముడు సహితము జాబాలిని కోపగించుట అను రజోగుణమును, బంగారులేడిని వెంబడించుట అను తమోగుణమును కలిగియున్నాడు. ఈ గుణముల వల్లనే దత్తుడు కోపముతో యున్న చండాలాది రూపములలో కనబడుచుండును, అయితే ఈ త్రిగుణమాయ అవతారపురుషుని వశములోయుండును. కావున అతడు “వశీకృతమాయుడు”.

దత్తస్వరూపము:

దత్తుని యొక్క ఆరు చేతులు, స్వీకరించిన మనుష్యశరీరము, పుట్టుక మొదలగు ఆరు వికారములను కలిగియే ఉండునని సూచించుచున్నది. శంఖము, ఢక్క శబ్దమును, జపమాల వాక్యమును సూచించగా ఆయన జ్ఞానమును బోధించుట చెప్పబడుచున్నది. చక్రము, శూలము, శక్తితోనున్న మంత్రజలముకల కమండలము ఆయన యొక్క శక్తిమంతములైన సిద్ధులను చెప్పుచున్నవి.

మొదటి మూడును ప్రధానదక్షిణార్ధమగు గురుస్వరూపమును, రెండవ మూడును వామార్ధమగు భగవత్స్వరూపమును మనుష్యావతారమున ఉండునని చెప్పుచున్నవి. కావున త్రిముఖ షడ్భుజ దత్తుడు అనగా త్రిగుణములతోయున్న మాయా మానవావతార పురుషుడేనని తాత్పర్యము. అట్టి అవతారపురుషుని సేవించక దత్తచిత్రములను, శిల్పములను సేవించి ప్రయోజనమేమి? శిలావిగ్రహములు కేవలము ప్రతీకలే అనగా ప్రతినిధులే.

ఆదిత్యం బ్రహ్మేతి” అను శ్రుతి సూర్యమండలమును పరమాత్మగా ధ్యానించమని చెప్పగా, మందమతులు, సూర్యుడినే పరమాత్మయని భావించినారు. అందుకే వేదము “నేదం తత్‌” అని మరల యీ జడగోళము అగు సూర్యమండలము పరమాత్మ కాదని బోధించినది. విగ్రహములు దర్శన, ధ్యాన యోగ్యములే కాని నైవేద్యాది సేవాయోగ్యములు కావు. త్రివర్ణపతాకము భారతదేశ ప్రతీక. అనగా ఆ పతాకము భారతదేశము కాదు. భారతదేశమును సూచించు ప్రతినిధియే. ఇక గోవు విషయము.

 

Part-4

గోవు: దత్తుని వెంట గోవు వచ్చుచున్నది. ఆవు ధర్మదేవతయొక్క రూపముగా చెప్పబడుచున్నది. దీనిలోని అంతరార్థము ఏమనగా ఆయన నడకను ఆవు అనగా ధర్మము వెంబడించుచున్నది కాని ఆయన ధర్మమును అనగా ఆవును వెంబడించి నడచుట లేదు. అనగా ఆయన నడచిన మార్గమే ధర్మమని అర్థము. ఆయన గోపాలుడు అనగా ధర్మరక్షకుడు. ఆయనచే రక్షింపబడు ధర్మము కన్న ధర్మమును రక్షించు ఆయనయే గొప్పవాడు.

కుక్కలు: అట్లే ఆయన పాదముల వద్ద వేదములు కుక్కలుగా పడియున్నవి. పాదములు అనగా ఆయన శ్లోకరూపముగా బోధించుచున్న జ్ఞానములో శ్లోకములోని నాలుగు పాదములు అను అర్థముతో ఆ నాలుగు పాదములను అనుసరించి వేదములు ఆయనపై ఉండవలసిన స్థిరవిశ్వాసమునకు ప్రతీకలుగా నిలచియున్నవి. అనగా ఆయన చెప్పు జ్ఞానవాక్యములను వేదములే అనుసరించుచున్నవి. అనగా ఆయన చెప్పిన ప్రతిమాటయు వేదమే అని అర్థము.

పండితులు వేదమును అనుసరించి వాక్యములను పలికెదరు. ఆయన వేదకర్త, వేదము ధర్మమూలము. కావున ఆయన చెప్పినది వేదము. ఆయన చేసినది ధర్మము అని తాత్పర్యము. “అస్య మహతో భూతస్య; వేదోఽఖిలో ధర్మమూలమ్” అను ప్రమాణములచే ఆయన వేదకర్తయనియు, వేదము ధర్మమూలము అని చెప్పబడినది గదా.

అవతారపురుషుడు జ్ఞానబోధ చేయునప్పుడు మామూలు స్థితిలో ఉన్నట్లుగాను, మహిమలను చేయుచున్నప్పుడు ఎక్కువశక్తితో చేరి ఉన్నాడని మీరు తలచుట చాలా పొరపాటు. అవతారపురుషుడు జ్ఞానబోధ చేయునప్పుడు పరిపూర్ణమైన పరమాత్మతో పూర్ణశక్తితో చేరియున్నాడు. అట్టి స్థితిలో అవతారపురుషుడు 100 వాట్స్‌ బల్బుతో సమానము. మహిమలను చేయునప్పుడు అత్యల్పశక్తితో కూడిన '0' వాట్స్‌ బల్బువలెయుండును. కావున క్షుద్రజనులు కూడా ఆ సిద్ధులను సాధించగలుగుచున్నారు. కాని బ్రహ్మజ్ఞానమును సాధించుట లేదు.

శ్రీకృష్ణుడు కౌరవులకు బోధ చేయునప్పుడు మరియు అర్జునునకు బోధ చేయునప్పుడు పరిపూర్ణమైన విశ్వరూపస్థితిలోనున్న తన స్వరూపమును చూపినాడు. కావున జ్ఞానబోధ చేయునప్పుడు పరిపూర్ణమైన శక్తిస్వరూపుడైన పరమాత్మయే చేయగలడు. కేవలము గ్రంధస్థమైన జ్ఞానమును బోధించు పండితులు కూడా '0' వాట్స్‌ బల్బుల వంటివారే. కావుననే పరమాత్మ చెప్పు జ్ఞానము ప్రజ్ఞానమని “ప్రజ్ఞానం బ్రహ్మ”అని వేదము చెప్పుచున్నది. ప్రజ్ఞానము అనగా జీవులకు సాధ్యము కాని ప్రకృష్టమైన అనగా అతి విశేషమైన జ్ఞానము అని అర్థము. ఇట్టి ప్రజ్ఞానము చేతనే పండితులగు గురువుల నుండి సద్గురువగు అవతారపురుషుని వేరు చేయవలయును.

“సత్‌” అనగా పరబ్రహ్మము. సద్గురువు అనగా గురుస్వరూపమున ఉన్న పరబ్రహ్మము అని అర్థము. అజ్ఞానము పతన కారణము మరియు అమితమైన బలము కలది. జ్ఞానము ఉద్ధరణ కారణము అనగా క్రింది నుండి పైకి పోవుట, దానికి బలము తక్కువ. అజ్ఞానము స్వభావ సిద్ధమైనది. కావున బోధించు ప్రయత్నమక్కరలేదు. నీరు స్వభావసిద్ధముగా ఎంతో వేగముతో పై నుండి క్రిందకు పడి పతనము చెందును. అదే క్రింద పడిన నీరు స్వయముగా పైకి పోవుటకు వేగము కలిగియుండదు. దానిని పైకి తెచ్చుటకు ఎంతో బాహ్యప్రయత్నము అవసరము. అట్లే అజ్ఞానులను ఉద్ధరించుటకు సద్గురువు ఎంతో శ్రమ పడుచుండును.

శిలావిగ్రహములకు తైలాభిషేకము చేసి తైలము వ్యర్థము చేయుచున్నారు. నరాకారములో వచ్చిన సద్గురువు అగు పరమాత్మయొక్క తలకు తైలము అంటుటయే నిజమైన తైలాభిషేకము. విగ్రహములు కేవలము దర్శనయోగ్యములే. వాటిపై దుమ్ము పడకుండా నీటితో కడిగి శుభ్రపరచుట అను స్నానోపచారము ఒక్కటి చేసిన చాలునని చెప్పియేయుంటిని గదా! పరమాత్మ మానవశరీరమును ఆవహించి అవతరించును. విద్యుత్తీగెను ఆశ్రయించి వ్యాపించి యున్నది కదా. కనుక తీగెను ఎచ్చట ముట్టుకున్నను షాకు కొట్టుచున్నది. కావున విద్యుత్తును తీగెను వేరు చేయలేము. విద్యుత్తే తీగె, తీగెయె విద్యుత్తు. అయితే ఇంత మాత్రమున విద్యుత్తు తీగెగా మారలేదు. విద్యుత్‌ పోయిన తర్వాత తీగెను ముక్కలు చేసినను విద్యుత్‌ ముక్కలు కాలేదు.

ఇదే విధముగా పరబ్రహ్మము మానవశరీరమును ఆశ్రయించి శ్రీకృష్ణునిగా అవతరించినది. పరబ్రహ్మము మానవ శరీరము యొక్క ఆపాదమస్తకము వ్యాపించియున్నది. “అంతర్బహిశ్చ తత్సర్వమ్” కావున శ్రీకృష్ణుడే పరబ్రహ్మము, పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు. ఐతే శ్రీకృష్ణుని నిర్యాణ సమయమున పరబ్రహ్మమైన నారాయణుడు శ్రీకృష్ణుని శరీరమునుండి నిష్ర్కమించగా ఆ కృష్ణుని శరీరమునకు పార్థుడు దహనసంస్కారము చేసెను. ఇంత మాత్రమున దానిచేత నారాయణుడు దహింపబడలేదు. ఏలననగా నారాయణుడు నరశరీరమును ఆశ్రయించినాడే కాని నారాయణుడు నరునిగా మారలేదు.

ఇది తెలియక అజ్ఞానులు నారాయణుడు మరణించెను, దహింపబడెను అని తలచెదరు. ఈ విషయమే గీతలో “మానుషీం తనుమాశ్రితమ్‌” అనగా పరమాత్మ మనుష్యశరీరమును ఆశ్రయించి అవతరించును అని చెప్పబడినది. గీతలో చెప్పినట్లు “అవ్యక్తం వ్యక్తిమాపన్నమ్” అనగా పరమాత్మ నరశరీరముగా మారి అవతరించినాడు అని ఆజ్ఞానులు తలచెదరు. కావున శ్రీకృష్ణుడు జీవించినంత కాలము సాక్షాత్తు నారాయణుడే కాని నిర్యాణానంతరము శ్రీకృష్ణశరీరము మామూలు నరశరీరమే.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch