home
Shri Datta Swami

 10 May 2025

 

శంకర జయంతి (మానవ గురువులు - సద్గురువు)

[24-04-2004] దత్తుడు సద్గురువుగా వచ్చినపుడు ఒక్క జీవునియైనా తరింపచేయాలని చూస్తాడు. ఆయన దృష్టి రూపాయిని సంపాదించుకొనుట కాదు. అట్టి దృష్టి కలవారు గురువులు. పదిమంది శిష్యులను పోగుచేసుకొని తలా పదిపైసలు గురుదక్షిణగా స్వీకరించి గురువు రూపాయి సంపాదిస్తాడు. కాని సద్గురువు యోగ్యుడగు ఒక జీవుని నుండియే వాని వద్ద నున్న ఒకే ఒక రూపాయిని తీసుకుంటాడు. ఇచ్చట సద్గురువుకు నిజముగా రూపాయి అక్కరలేదు. యోగ్యుడగు వాని యొక్క ధనబంధమును సంపూర్ణముగా తెంచి వానిని ముక్తుని చేయుటయే ఆయన లక్ష్యము. మానవ గురువుల వద్ద ఏ శిష్యడూ ముక్తుడు కాడు. మానవ గురువులు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల వంటివారు. అడిగిన ఒక్క రోగము యొక్క ఉపశమనమును మాత్రమే చేయుదురు. అపోలో డాక్టర్లు అట్లు కారు. అన్ని పరీక్షలను చేసి అన్ని రోగములను గుర్తించి దానికి చికిత్సచేసి వాని యొక్క అన్ని రోగములకు మోక్షమును ప్రసాదించును. అసమర్థుడైన ఉపాధ్యాయుని వద్దనున్న పదిమంది శిష్యులకు తలా పది మార్కులు వచ్చి అందురు ఫెయిల్ అవుతారు. కాని, సమర్థుడైన ఉపాధ్యాయుడు యోగ్యుని గుర్తించి, వానిపై దృష్టి కేంద్రీకరించి, ఆ ఒక్కనినైనా పాసు చేయుటకు ప్రయత్నిస్తాడు. సక్తుప్రస్థుని ఇంటికి వచ్చిన అతిథికి నాలుగు ముద్దల పేలపిండి కావలసిరాలేదు. అట్లు కావలసినచో నాలుగు ఇండ్లకు తిరిగి నాలుగు ముద్దలు బిచ్చమెత్తును. సద్గురువు ఒక ఇంటిలోనే భిక్ష చేయును.

Swami

సాయి కేవలము ఐదు ఇండ్లలోనే భిక్ష తీసుకున్నాడు. మానవ గురువులకు తమ శిష్యులకు ప్రియమును చేయుటయే లక్ష్యము గాదు. షుగరు పేషంటు హోటలుకు పోయి గులాబ్ జాములు ఆర్డరు ఇచ్చినప్పుడు నీకు షుగరు వున్నదా అని హోటలువాడు అడుగడు. నీ వద్ద ధనమును తీసుకొని గులాబ్ జామును ఇచ్చును. మానవ గురువుల బోధలు ఇట్లు ఉండును. దత్తసద్గురువు యొక్క జ్ఞానబోధ అతి విచిత్రముగ యుండును. నీవు గులాబ్ జాము అడిగినప్పుడు నీ నుండి ముప్పది రూపాయలు తీసుకుని నీకు రక్తపరీక్షలు చేయును. షుగరు ఉన్నదని తేలినచో మరల పదిరూపాయలు తీసుకుని కాకరకాయ రసమును ఇచ్చును. మానవ గురువులు అట్టి పరీక్షను చేయక నీ నుండి పదిరూపాయిలు తీసుకుని గులాబ్ జామును ఇచ్చుదురు. బ్లడ్ పరీక్షలో సూది గుచ్చుట, అమితమైన చేదుగల కాకరకాయ తాగునపుడు దుఃఖము, నీ నలభై రూపాయలను వదలుకొనుట మొదలగు కష్టములు దత్తుని వద్ద యుండును. శంకరులు కేవలము నలుగురినే శిష్యులుగా చేసుకొని వారిని ఉద్ధరించినారు. కాని ఈనాటి గురువులు కేవలము కీర్తిని, బలమును ఆశించి వేలాది శిష్యులను సంపాదించుకొని సత్యజ్ఞానమును తెలియచేయవలసినను, పరుషముగాయున్ననూ బోధించక కేవలము వారికి ప్రియమైన సిద్ధాంతములను బోధించువారై యున్నారు.

ఉత్తరదేశమునందు అవతరించిన శ్రీరాముడు (నారాయణుడు), దక్షిణదేశమునందు అవతరించిన శంకరులు (శివుడు) గురువులకును ఆదర్శములు. ఈనాడు గురువులందరునూ ఈ శంకరజయంతి సందర్భమున సద్గురువుయగు శంకరుని స్మరించవలెను. ఇదే త్రిమూర్త్యాత్మక దత్తగురుతత్త్వము. ఇదే గురుత్రయ స్వరూపమగు శంకర గురువుల తత్త్వము.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch