home
Shri Datta Swami

 27 Oct 2025

 

పండితులకు సందేశము

Note: This article is meant for intellectuals only


Part-1


Part-1

[21-12-2002] శ్రీ దత్త భగవానుడు శంకరులుగా అవతరించినపుడు ఈ దేశమంతయును నాస్తికులతో నిండియుండెను. ఈ నాస్తికులు రెండు విధములుగా యుండిరి. మొదటి విధము వారు పూర్వమీమాంసకులు. వీరు యజ్ఞయాగాదులను మాత్రమే చేయుచు భగవంతుడులేడని వాదించుచుండిరి. వీరి మతము ప్రకారముగా "దేవో న కశ్చిత్‌ భువనస్య కర్తా" "కర్మానురూపాణి పురఃఫలాని" అనగా ఈ జగత్తు లేక ఈ శంకరుడును లేడు లేడు. వేదములో చెప్పబడిన యజ్ఞములను చేసినచో మనము ఇహలోకములోను పరలోకములోను సుఖములను పొందవచ్చును. దీనినే కర్మమార్గము లేక పూర్వ మీమాంసామతము అందురు. ఈ మతమునకు అప్పుడు మూల ప్రవక్తగా మండనమిశ్రుడను పండుతుడు కాశ్మీరమున ఉండెడివాడు. ఈ యజ్ఞములలో అగ్నికుండములో నేతి పదార్థములు ధారలు ధారలుగా పోసి హుతము చేయుచు సాధు ప్రాణులైన మేకలను చంపుచు వేదాధ్యయనము, యజ్ఞాచరణము వలన అహంకారము నెత్తికెక్కి ఉండెడివారు. అప్పుడు శ్రీ దత్తుడు బుద్ధ రూపమున వచ్చి యజ్ఞములను మాన్పించెను. ప్రాణి హింస నిషేధించెను. ఆకలి గొన్న ప్రాణుల యొక్క జఠరాగ్ని కుండములందు హుతము చేయవలసిన శ్రేష్ఠమైన ఘృతాహారమును అగ్నియందు దగ్ధము చేయు దురాచారమును ఖండించెను.

కరుణ తత్త్వమును బోధించి ఆకలితో మాడు సాధు ప్రాణులకు ఆహారమును అందించు కర్మయే యజ్ఞమని బోధించెను. జ్ఞానమను అగ్నిలో కోరికలు అను నేతిని హుతము చేసి మూర్ఖత్వము అను పశువును వధించమని "కామ ఆజ్యం మన్యుః పశుః" అను శ్రుతి తత్త్వమును భోధించెను. వేదములన్నియు యజ్ఞములను గురించియే చెప్పుచున్నవి కావున యజ్ఞములను చేయుట అవసరమని పూర్వ మీమాంసకులు వాదించగా, వేదములను మనుష్యులగు పురుషులు చెప్పినారనియు, అవి పౌరుషేయములనియు బుద్ధుడు వాని యొక్క ప్రామాణ్యము ఖండించెననియు బౌద్ధులు చెప్పుచున్నారు. కాని ఇది నిజము కానే కాదు. బుద్ధుడు యజ్ఞములను, పశువధలను వేద ప్రమాణము చేతనే ఖండించినాడు. ఇది ఈనాడు వరకును ఎవరికి తెలియని సత్యము. వేద వాదులగు పూర్వ మీమాంసకులను ఖండించుటకు వారికి ప్రమాణమగు వేదమునే ఆధారముగా తీసుకొనవలయును. ఆహారమైన ఘృతమును దగ్ధము చేసి వ్యర్థము చేయరాదనుటకు "అన్నం న పరిచక్షీత" అను శ్రుతిని ప్రమాణముగా తీసుకొనినాడు. దీని అర్థము మనము ఆహారమును వ్యర్థము చేయరాదనియే. అట్లే పశువధను మాన్పించుటకు బ్రహ్మయజ్ఞ ప్రకరణములోని "మన్యుః పశుః" అను శ్రుతిని తీసుకొన్నాడు. అనగా అజ్ఞానముతో కూడిన మూర్ఖత్వమను పశువును వధించవలయునని అర్థము. బుద్ధుడు ఆనాడు బోధించిన సిద్ధాంతమును బౌద్ధులు పూర్తిగా విడచి పెట్టగా అది అదృశ్యమైనది. బుద్ధుడు వేదములను పౌరుషేయములు అన్నాడు. అనగా పురుష విరచితములు. కాని పురుషుడనగా ఎవరు? జీవుడు కాదు.

Swami

పురుషుడనగా పురుషసూక్త ప్రకారముగా పరమాత్మయని అర్థము. కావున పౌరుషేయము అనగా పరమాత్మ రచించినది అని అర్థము. పూర్వ మీమాంసకులు వేదములను "అపౌరుషేయములు" అన్నారు. అనగా పురుషరచితములు కావు అని అర్థము. అనగా పరమాత్మ రచించలేదనియే అర్థము తీసుకొనవలెను. ఏలననగా వారి మతము ప్రకారముగా పరమాత్మ లేడు గదా! "దేవో న కశ్చిత్‌" అని చెప్పుచున్నారు గదా! కాని దురదృష్టవశాత్తు ఈనాడు మన పండితులు అర్థము చేసుకొన్నది మరియొకటి అయినది. పురుషుడు అను శబ్దమునకు జీవుడు అను అర్థము కూడా కలదు. "అన్నాత్‌ పురుషః" అని శ్రుతి కదా! కావున మన పండితులు ఇప్పుడు చెప్పునది ఏమనగా వేదములు పౌరుషేయములు అని బుద్ధుడు చెప్పినప్పుడు వేదములను మానవులు వ్రాసినారనియే బుద్ధుడు చెప్పినాడని చెప్పుచున్నారు. ఇదియే నిజమైనచో వేదములు అపౌరుషేయములు అని వేదవాదులు చెప్పినారు గదా! అనగా వేదములు మానవులు రచించలేదని వేదవాదులు చెప్పినట్లు అర్థము వచ్చును. అనగా వేదములను పరమాత్మ వ్రాసినాడని పూర్వ మీమాంసకులు చెప్పినట్లును కాదు మానవులు వ్రాసినారని బుద్ధుడు ఖండించినట్లు అర్ధము వచ్చుచున్నది. ఇదే నిజమైనచో పూర్వ మీమాంసకులు పరమాత్మను అంగీకరించినట్లు అర్థమగుచున్నది. కాని పూర్వ మీమాంసకులు పరమాత్మను నిరాకరించినారు కదా! కావున జరిగినది ఒకటి, మన పండితులు తీసిన అర్థము మరియొకటి. కావున అసలు జరిగినది ఏమి? అక్కడ ‘పురుష’ శబ్దమునకు పరమాత్మ అని అర్థము తీసుకొనవలయును. ఇప్పుడు అర్థము సరిపోవును. వేదములు అపౌరుషేయములు అని పూర్వ మీమాంసకులు అన్నారు. అనగా పురుషుడైన పరమాత్మ వ్రాసినది కావు అని అర్థము. వారు నాస్తికులు కావున ఈ అర్థము సరిపోవును.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch