home
Shri Datta Swami

 08 May 2025

 

భారతదేశము ఎప్పుడునూ దారిద్ర్యముతో బాధపడుచున్నది. ఎందువలన?

[13-07-2003] భారతీయ పండితులు కర్మఫలత్యాగమును (sacrifice of fruit of work i.e., money) యుక్తులతో చేసినట్లు నటించుచున్నారే కానీ కర్మఫలత్యాగమును చేయుటలేదు. పరీక్షకు పేపరు, పెన్నువలె ఈ పరీక్షకు కర్మఫలమగు ధనము, నరాకారమున ఉన్న స్వామి కావలయును. ఆహారమును విగ్రహమునకు చేయి చూపించి దానిని ప్రసాదముగా తీసుకొనుటలో స్వామి ఒక్క మెతుకు కూడా తినలేదు. మరియొక్క  అతితెలివి ఏమనగా మానవుడు ఆహారమును భుజించి మానవుడే మాధవుడు కావున మాధవుడే భుజించినట్లుగా భావించుచూ స్వామికి కర్మఫలత్యాగమును చేసినట్లుగా పలుకుచున్నాడు. ఇట్టి అతితెలివి మార్గములలో కర్మఫలము నిజముగా వారి వద్దనే ఉన్నది. ఈ విధముగా భారతీయ పండితులు తమ లోభమును అతి తెలివితేటలతో కప్పి పుచ్చినారు. హృదయము ప్రేమతోను, బుద్ధి తెలివితేటలతోను నిండియుండును. భారతీయులు స్వామికి బుద్ధిలోనున్న తెలివిని, కుటుంబమునకు హృదయములో నున్న ప్రేమను త్యాగము చేసినారు. విదేశములలో వారు కుటుంబమునకు తెలివిని, స్వామికి ప్రేమను ఇచ్చుచున్నారు. ప్రేమ యొక్క ఫలమే కర్మఫలత్యాగము. తెలివియొక్క ఫలములే ధ్యానము, స్తోత్రము మొదలగునవి. ఈ తెలివియే భారతదేశమునకు దారిద్ర్యమును తెచ్చినది. చేతిలోనున్న పేలపిండి గాలికి ఎగిరిపోయినచో దానిని "రామార్పణం" అను స్థాయికి భారతీయుల తెలివి పెరిగినది. విదేశీయులు సంపాదించి, అనుభవించి మిగిలిన దానిని త్యాగము చేయుచున్నారు. వారు తమ పిల్లలను వయస్సు రాగానే సంపాదించి జీవించమని బయటకు పంపుచున్నారు. 

భారతదేశములో ఉన్న కుటుంబబంధములకన్ననూ విదేశములలో ఉన్న కుటుంబబంధములు చాలా బలహీనమైనవి. కావున విదేశీయుల హృదయములలో కుటుంబ బంధముల ద్వారా కారిపోని ప్రేమ ఎక్కువగా మిగిలియున్నది. వారికి భగవంతుని గురించి తెలియగనే ఆ ప్రేమ అంతయును విజృంభించి స్వామి మీదికే పూర్తిగా మరలించబడుచున్నది. వారి కర్మఫలత్యాగము పూర్ణము కావున త్వరగా స్వామిని చేరుకొనుచున్నారు. వారి బుద్ధులు నేరుగా ఉన్నవి కావున కనీసము పిల్లలకు సైతము దాచుట లేదు. కావున వారి దేశములను సంపన్నదేశములుగా స్వామి అనుగ్రహించినారు. భారతదేశములో ఎంత జ్ఞానము వర్షించినా ఇంకి పోవుచున్నదే కాని ఆచరణలో ఉపయోగించుటలేదు. విదేశములలో గట్టి నేలపై వర్షించిన వాన నదివలె ప్రవహించినట్లు జ్ఞానము అందరికీ ఉపయోగపడుచున్నది. సైన్సులో కూడా విదేశీయులు ఆచరణమునకు ప్రాధాన్యతను ఇచ్చుచుండ, భారతీయులు మేథాశక్తితో, చర్చలతో గడుపుచున్నారు. ఈ స్వభావము అథ్యాత్మిక సంప్రదాయము నుండి భారతీయులకు సంక్రమించినది. అందుకే భారతదేశమును స్వామి అపార మేథాశక్తితోను, విదేశీయులను అపారధనములతోను అనుగ్రహించినారు. "ఎవరు ఎట్లు నన్ను సమీపింతురో వారిని అట్లు సమీపింతును" అని గీతా వాక్యము.

ఈ పూర్ణిమ పూర్ణచంద్రుడు ధనమును, మనస్సును సూచించును. కావున నీ పూర్ణప్రేమను కర్మఫలత్యాగము ద్వారా పూర్ణవిశ్వాసముతో కూడిన మనస్సుతో సద్గురువునకు గురుదక్షిణగా ఇచ్చుటయే తాత్పర్యము. పూర్ణిమనాడు దత్తుడు సాక్షాత్కరించినందున ప్రతిపూర్ణిమ నాడు మీరు గురుదక్షిణ  ద్వారా కర్మఫలత్యాగము చేయవలెను. కాని గురువుకు ప్రదక్షిణములను చేయుట కాదు. భారతీయులు తప్పుదిద్దుకొని కర్మఫలత్యాగమును నేర్చుకొని తమ దేశమును సంపన్నదేశముగా స్వామి అనుగ్రహము ద్వారా సాధించవలయును. భారతీయుల ఆథ్యాత్మిక కేంద్రములు సైతము విదేశధనముల ద్వారానే వృద్ధిచెందిన విషయము స్పష్టమే కదా. స్వామి వివేకానందుదు "ఇంత జ్ఞానముతో ఉన్న నా భారతదేశము ఇంత దారిద్ర్యముతో ఏల బాధపడుచున్నది?" అని పెద్దగా ఏడ్చినాడు. దానికి స్వామి ఇచ్చు సమాధానమే ఇది.

శ్రీదత్తుని పాదముల వద్దనున్న కుక్కలు కాపలా పనిని చేయుచూ కర్మసంన్యాసమును చూపుచున్నవి. గోవు తన దూడను సైతము వదలి తన పాలను దత్తునికి ఇచ్చుచూ కర్మఫలత్యాగమును చేయుచున్నది. కర్మఫలత్యాగముతో కూడిన కర్మసంన్యాసమే కర్మయోగము. కేవలము కర్మసంన్యాసము కన్ననూ కర్మయోగమే గొప్పదని గీత "తయోస్తు..."  అని చెప్పుచున్నది. అనగా సద్గురువు చేయు జ్ఞాన, భక్తి ప్రచారమునకు చేయు సేవయే కర్మయోగము. ఇదే కేవలము దత్తుని చేరు మార్గము. యోగవాశిష్ఠములో శ్రీ రాముని ముందు ధనమునార్జించి గురుదక్షిణ తెమ్మని వశిష్ఠుడు ఆదేశించినాడు.

Swami

"గురు స్సాక్షాత్ పరబ్రహ్మ" గురువు అనగా సద్గురువగు "శ్రీదత్తుడే". భిక్షల ద్వారా, గురుదక్షిణల ద్వారా నిరూపించబడిన నీ భక్తికి సంతసించి, అతడే నీ పాపములను, నీ భక్తికి తగు ప్రమాణములో గ్రహించి నిన్ను ఈ లోకములో సుఖముగా ఉంచి సాధన చేయించగల సమర్థుడు. సాయి తనకు సమర్పించు రొట్టెలు వారి పాపములు అని చెప్పినారు. పేదవాడు ఇచ్చు రూపాయి గురుదక్షిణ ధనికుని లక్షలతో సమానము. సద్గురువువలె జీవుడు సమర్థుడు కాడు. ప్రాచీన కాలములో పండితులు ఎవరి ఇంటనూ భుజించుట కాని, దక్షిణలను స్వీకరించుట కానీ చేసెడివారు కారు. (అపరిగ్రహ వ్రతము). ఇందుకే ఈ రెండింటికీ అవకాశము కల పౌరోహిత్యమును తప్పని సరికానిచో చేయుటకు ఇష్టపడెడి వారు కాదు. తన పాపములతోనే సతమతమగుచుండగా ఇతరుల పాపములను స్వీకరించి అనుభవించగల ఓర్పు, శక్తి జీవులకు ఉండదు. కావున ఒకరి ఇంట భోజనము చేయక వైశ్వదేవమును పాటించెడివారు. అందుకే భోజనము, బహుమానములను గుర్తుంచుకొని మరల చెల్లించుచుందురు.

సద్గురువు దక్షిణలను, మరల జ్ఞాన, భక్తి ప్రచారములకు, దరిద్రులగు భక్తులకు సాయపడుటలోను ఉపయోగించి లోకకళ్యాణమునకే పాటుపడును. మరియు సద్గురువు భిక్షలద్వారా పొందిన అన్నశక్తిని కూడా జ్ఞానబోధలోనే ఖర్చు చేసి జీవులను ఉద్ధరించును. ఇట్టి త్యాగము వలన దత్తుడు అను శబ్దము స్వామికి సార్థకమైనది.

[స్వామి ప్రవచనము వినగానే భక్తులందరునూ ప్రతి నెలా ఈ జ్ఞాన, భక్తి ప్రచార కార్యమునకు యథాశక్తిగా గురుదక్షిణలను అందచేయుటకు నిశ్చయించుకున్నారు. స్వామి తరువాత రెండు గంటలు భజన చేసినారు. భజన సమయములో స్వామి నుండి సుగంధము వచ్చినది. తరువాత 20 ని.లు మరల విపరీతముగా వచ్చినది.  ఒక భక్తునకు నీలిరంగులో పాదములు కనిపించినవి. మరియొక భక్తుడు స్వామిని షిరిడిసాయి దర్శనము అర్థించగా వానికి ప్రకాశించు నేత్రములతో షిరిడీసాయిగా స్వామి దర్శనము ఇచ్చినారు. ఈ జ్ఞాన, భక్తి ప్రచార యజ్ఞమునకు ప్రతి నెలా పూర్ణిమకు గురుదక్షిణలను ప్రకటించిన ఈ క్రింది భక్తులు శ్రీదత్తుని పూర్ణఅనుగ్రహమునకు పాత్రులగుచున్నారని చెప్పుటకు సంతసించుచున్నాము.

  1. శ్రీమతి ఎస్.గాయత్రి, చంద్రశేఖర్ గారు. రు. 10,000/-
  2. శ్రీమతి నాగలక్ష్మి, అజయ్ రు. 7,000/-
  3. శ్రీమతి ఉమ, రామనాథ అయ్యర్ రు. 5,000/- మిగిలిన వారు 100 నుండి 1,000 వరకు ప్రకటించినారు.]

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch